హైదరాబాద్: నగరంలో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన ముగ్గురు టెర్రరిస్టులను పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకు ముందు వైద్య పరీక్షల నిమిత్తం వారిని సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో వరుస బాంబు పేలుళ్ల కుట్రను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు. పబ్లిక్ ప్లేసులు, మీటింగ్స్లో బ్లాస్టింగ్స్ చేసేందుకు ప్లాన్ చేసిన ముగ్గురు టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 4 హ్యాండ్ గ్రనేడ్లు, రూ.5.41 లక్షల నగదు, ఆరు సెల్ఫోన్లు, బుల్లెట్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
పాకిస్తాన్ ఐసిస్ ఫండింగ్తో దేశవ్యాప్తంగా విధ్వంసాలకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ, టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్లోని 8 ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలు జరిపారు. 25 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ముసారాంబాగ్కు చెందిన అబ్దుల్ జాహెద్ (39), సైదాబాద్కి చెందిన సమీయుద్దీన్(39), మెహిదీపట్నానికి చెందిన మాజ్ హసన్ ఫరూక్ (29)లను అరెస్టు చేశారు. తాజాగా ఈ ముగ్గురిని నాంపల్లి కోర్టుకు తరలించారు.