మంత్రి ప్రోగ్రామ్​లో ప్రొటోకాల్ రగడ

మంత్రి ప్రోగ్రామ్​లో ప్రొటోకాల్ రగడ
  • ఎంపీటీసీకి కుర్చీ వేయకపోవడంపై 
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యంతరం
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల బాహా బాహీ 

కొల్చారం, వెలుగు: మెదక్​ జిల్లా కొల్చారంలో బుధవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్న ప్రోగ్రామ్​లో ప్రొటో కాల్ వివా దం చిలికి చిలికి గాలి వానలా మారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య బాహాబాహీకి దారితీసింది. జడ్పీ హైస్కూల్ లో నిర్వహించిన బడి బాట కార్యక్రమానికి మంత్రి సురేఖ, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ‘వేదిక మీద స్థానిక ఎంపీటీసీ అరుణకు కుర్చీ వేయలేదు. కానీ, ప్రొటోకాల్​ లేని వారు స్టేజీ మీద ఉన్నారు’ అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అనడంతో వివాదం మొదలైంది. 

స్టేజీ మీద నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే అలా వ్యాఖ్యానించారని కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీ శంకర్, జడ్పీటీసీ భర్త సంతోష్ కాంగ్రెస్ లీడర్లతో గొడవకు దిగారు. మాటామాటా పెరిగి ఇరు వర్గాలు ఒకరినొకరు తోసుకున్నారు.

 దీంతో మంత్రి, ఎమ్మెల్యే ఆదరా బాదరగా స్టూడెంట్స్​కు యూనిఫామ్స్, నోట్ బుక్స్ పంపిణీ చేసి వెళ్లిపోయారు. తర్వాత కొత్తగా నిర్మించిన ఎంపీడీవో ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి వెంట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి రాజిరెడ్డి ఉండడంపై ఎమ్మెల్యే సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి మంత్రి ‘మనం తర్వాత మాట్లాడుకుందాం’ అంటూ రిబ్బన్ కట్ చేసి ఆఫీస్ లోకి వెళ్లిపోయారు. 

స్కూల్ వద్ద జరిగిన గొడవను దృష్టిలో ఉంచుకొని పోలీసులు కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లు ఎవరినీ ఎంపీడీవో ఆఫీస్ లోకి అనుమతించ లేదు. దీంతో ఇరుపార్టీల నాయకులు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వందలాది మంది గుమిగూడి ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అంటూ తోసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి, ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాక పరిస్థితి సద్దుమణిగింది.