- గత మూడేండ్లలో సగటున 33 శాతం అప్
- సుమారు రూ.4,700 నుంచి రూ.6,000 కి పెరిగిన చదరపు అడుగు ధర
- డిమాండ్తో పాటు నిర్మాణ ఖర్చులు పెరగడమే కారణం
న్యూఢిల్లీ : దేశంలోని టాప్ సిటీలలో ఇండ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత మూడేళ్లలో టాప్ ఏడు సిటీలలో ఇండ్ల ధరలు సగటున 13 శాతం నుంచి 33 శాతం పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ అనరాక్ పేర్కొంది. డిమాండ్ బాగుందని, అందుకే ఇండ్ల రేట్లు పెరుగుతున్నాయని వెల్లడించింది. దేశంలోని టాప్ సిటీలలో హైదరాబాద్లోనే రేట్లు ఎక్కువగా పెరిగాయి. గచ్చిబౌలి ఏరియాలో ఇండ్ల రేట్లు గత మూడేళ్లలో సగటున 33 శాతం పెరిగాయని అనరాక్ పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి గచ్చిబౌలిలో చదరపు అడుగు సగటు ధర రూ.6,355 గా రికార్డయ్యింది.
మూడేళ్ల క్రితం అంటే 2020 అక్టోబర్లో ఈ నెంబర్ రూ.4,790 దగ్గర ఉంది. హైదరాబాద్లోని కొండాపూర్లో చదరపు అడుగు సగటు ధర రూ.4,650 నుంచి రూ.6,090 కి పెరిగింది. ఇది 31 శాతం గ్రోత్కు సమానం. బెంగళూరులోని వైట్ఫీల్డ్ ఏరియాలో ఇండ్ల రేట్లు గత మూడేళ్లలో సగటున 29 శాతం ఎగశాయి. చదరపు అడుగు ధర రూ. 4,900 నుంచి రూ.6,325 కి పెరిగింది. ‘డిమాండ్ పెరగడంతో పాటు ముడిసరుకుల ధరలు కూడా ఎక్కువవ్వడంతో దేశంలోని టాప్ ఏడు సిటీలలో ఇండ్ల ధరలు పెరుగుతున్నాయి’ అని అనరాక్ రీజినల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకుర్ అన్నారు.
గత కొన్నేళ్లుగా ప్రాపర్టీ రేట్లు పెరుగుతున్నాయని, ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) ఎండీ రవి అగర్వాల్ పేర్కొన్నారు. ముడిసరుకుల ధరలు, నిర్మాణ ఖర్చులు ఎక్కువవ్వడం, ల్యాండ్ ధరలు పెరగడంతో పాటు డిమాండ్ కొనసాగుతుండడంతో ఇండ్ల రేట్లు పెరుగుతున్నాయని చెప్పారు. అంతేకాకుండా ఇండ్లు కొనుక్కునేవారి టేస్ట్ మారిందని, పెద్ద ఇండ్లకు డిమాండ్ పెరుగుతోందని వెల్లడించారు. ఎక్కువ సౌకర్యాలు ఉండే ఇండ్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, అందుకే రేట్లు పెరుగుతున్నాయని వివరించారు.
ఇతర సిటీలలో ఇలా..
అనరాక్ రిపోర్ట్ ప్రకారం, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), ఢిల్లీ–ఎన్సీఆర్లో ఇండ్ల ధరలు గత మూడేళ్లలో సగటున 13 శాతం నుంచి 27 శాతం పెరిగాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లోని గ్రేటర్ నోయిడా (వెస్ట్) లో ఇండ్ల ధరలు సగటున 27 శాతం ఎగశాయి. సెక్టార్ 150 (నోయిడా), రాజ్ నగర్ ఎక్స్టెన్సన్ (ఘజియాబాద్) లో సగటున 25 శాతం పెరిగాయి. అదే ఎంఎంఆర్లో అయితే ఇదే టైమ్లో సగటున 21 శాతం పెరిగాయి. లోవర్ పారెల్, అంధేరి, వోర్లి ఏరియాల్లో ధరలు ఎక్కువగా పెరిగాయి. బెంగళూరు థానిసంద్రా మొయిన్ రోడ్ ఏరియాలో 27 శాతం, సార్జాపూర్లో 26 శాతం ఎగశాయి.
పూణెలో అయితే వాఘోలి (సగటున 25 శాతం), హిన్జెవాడి (22 శాతం), వకడ్ (19 శాతం) ఏరియాల్లో గత మూడేళ్లలో ఇండ్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ మూడు ఏరియాలు కూడా ఐటీ జోన్లు కావడం విశేషం. చెన్నైలో పెరుంబకం (19 శాతం), గుడువంచెరీ (17 శాతం), పెరంబుర్ (15 శాతం) ఏరియాల్లో కూడా రేట్లు భారీగానే పెరిగాయి. కోల్కతాలోని జోకా, రాజర్హట్, ఈఎం బైపాస్ ఏరియాల్లో రేట్లు 24 శాతం వరకు ఎగశాయి.
మరోవైపు రియల్ ఎస్టేట్ సెక్టార్ దూసుకుపోతుండడంతో ఈ సెక్టార్ రిలేటెడ్ షేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలిస్తున్నాయి. ఈ ఏడాది నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 62 శాతం పెరిగింది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపును తాత్కాలికంగా ఆపడం, డిమాండ్ కొనసాగుతుండడం వంటి కారణాలతో రియల్టీ షేర్లు భారీగా పెరిగాయి. కంపెనీలు పెద్ద మొత్తంలో బుకింగ్స్ అందుకుంటున్నాయి. మార్కెట్లో లిస్ట్ అయిన 14 రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రీ సేల్స్ ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 48 శాతం పెరిగాయి. అదే జూన్ క్వార్టర్తో పోలిస్తే 44 శాతం ఎగశాయి.
ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ల ప్రీ– సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రీ సేల్స్ (ఇయన్ ఆన్ ఇయర్) 32 శాతం పెరగగా, చివరి ఆరు నెలల్లో సేల్స్ గ్రోత్ ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త ప్రాజెక్ట్లు అందుబాటులోకి వస్తుండడంతో సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నాయి. మరిన్ని కొత్త లాంచ్లు ఉండడంతో రియల్టీ కంపెనీల షేర్లు ఇంకా పెరుగుతాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.