హైదరాబాద్, వెలుగు : జూనియర్ పంచాయతీ సెక్రటరీ(జేపీఎస్)ల రెగ్యులరైజేషన్ ఫైలు సీఎం కేసీఆర్ వద్దకు చేరింది. వీరిని రెగ్యులర్ చేయాలని సీఎం భావించినప్పటికీ, ఇప్పుడు పక్కకు పెట్టినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల తమను రెగ్యులర్ చేయాలని పీఆర్ డైరెక్టర్కు సమ్మె నోటీసు ఇవ్వటంపై సీఎం ఫైర్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల11తో జేపీఎస్ల 4 ఏండ్ల ప్రొబెషన్ టైమ్ ముగిసింది.
ఈ ఫైల్ను సీఎం ప్రగతి భవన్కు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం జేపీఎస్లు సుమారు 8,500 మంది ఉండగా వారిని రెగ్యులర్ చేస్తే ఎంత ఆర్థిక భారం పడుతుందన్న అంశంపై త్వరలో ఫైనాన్స్ అధికారులతో చర్చించి రెగ్యులరైజ్ నిర్ణయాన్ని తనే ప్రకటించాలని సీఎం భావించారని అధికారులు చెబుతున్నారు. సమ్మె నోటీసు ఇవ్వటంతో రెగ్యులర్ చేసే అంశం లేట్ అవుతుందని అంటున్నారు.