విద్యాహక్కు చట్టం అమలు చేయాలి

విద్యాహక్కు చట్టం అమలు చేయాలి

విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థలు చట్టంలోని సెక్షన్ 12(1)(సి) ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 25శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శికి  హైకోర్టు అక్షింతలు వేసింది. 2020లో కొందరు సామాజిక కార్యకర్తలు ఈవిషయమై దాఖలు చేసిన పిటిషన్​పై తెలంగాణా హైకోర్టు.. సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ తీర్పునిచ్చింది. 

తీర్పు మేరకు తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి 2024 అక్టోబర్ 10న ప్రైవేటు విద్యా సంస్థలకు నోటీసు ఇచ్చి చేతులు దులుపుకోవడంతో  మరోసారి ఈ విషయంపై న్యాయస్థానం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రశ్నించింది. గుర్తింపుపొందిన ప్రైవేటు విద్యాసంస్థలు యాజమాన్యాలు (ట్రెస్మా) బలహీన వర్గాలకు విద్యాహక్కు చట్టం ప్రకారం 25శాతం సీట్లు నిబంధన అమలు జరిపేది లేదని స్పష్టంగా ప్రకటించారు. 

ఈ ప్రకటన  విద్యాహక్కు చట్టాన్ని తిరస్కరించడం అవుతుంది.  విద్యాహక్కు చట్టం అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత15 ఏళ్ళుగా అమలుపరచని ఈ నిబంధనతో పాటు, క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయడం చట్టవిరుద్ధం.  కనుక నిబంధనల అమలులో పారదర్శకత ఉండాలి. విద్యాహక్కుచట్టం నిబంధనలు అమలుకోసం ప్రభుత్వం ఏదైనా వ్యవస్థను నెలకొల్పడం అనే అవసరం ఇప్పుడు ముందుకొచ్చింది.

రాజ్యాంగ చట్టంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఈచట్టం వచ్చింది.  అనేక ఏళ్ళ పోరాటం మూలంగా వాస్తవంగా విద్యాహక్కు చట్టం -2009లోచట్టంగా ముందుకొచ్చింది. 2010 ఏప్రిల్ నుంచి ఆ చట్టం అమలులోకి వచ్చింది. అప్పటినుంచి 15ఏళ్ళుగా ప్రైవేటు విద్యా సంస్థలు చట్టంలోని సీట్ల రిజర్వేషన్లు అంశాన్ని దాటవేస్తూ అసలు పట్టించుకోలేదు. అంతేకాదు ఆర్టీఇ సెక్షన్ 18 ప్రకారం విద్యార్థుల వద్ద క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదని చట్టం నిర్దేశించినప్పటికీ, ప్రైవేటు విద్యా సంస్థలు విపరీతంగా ఫీజులు పెంచి వసూలు చేస్తున్నారు. 


ఇక ట్యూషన్ ఫీజు విషయంలో కూడా ప్రైవేటు విద్యా సంస్థలకు నాలుగు రకాల స్లాబులు కాకుండా అందరికీ అందుబాటులో ఉండే ఒకే స్లాబును ప్రభుత్వం నిర్థారించవలసి ఉంది. అప్పుడు మాత్రమే చట్టం నిర్దేశించిన  విద్యా సమానత్వంకు అర్థం చేకూరుతుంది. రెండు అంశాలు ప్రైవేటు విద్యాసంస్థలు పట్టించుకొన్న దాఖలాలు లేవు. చట్టం అమలుజరపాలసిన ప్రభుత్వ వర్గాలు కూడా కేవలం నోటీసులిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు.

మూల్యాంకనంలో కొరవడిన స్పష్టత

ఇక ప్రభుత్వ విద్యాసంస్థలులోనైతే బోధనా పద్దతులు, మూల్యాంకనం విధానం అమలు జరపడంలో స్పష్టత లోపించింది.  పదవతరగతి మూల్యాంకనం విషయంలో కూడా చట్టం నిర్దేశించిన విధానంలో కాకుండా 100 మార్కులకు జరిపి  విద్యాశాఖ అధికారులు చేసిన ప్రయత్నం సాంకేతిక కారణాలు వలన మరుసటి ఏడాదికి వాయిదా పడింది. 2025–-26లో అమలుకు నిర్ణయం తీసుకున్నారు.  

విద్యాహక్కు చట్టం ప్రకారం వయస్సు ఆధారిత సామర్థ్యాలు విద్యార్థులకు అందించడం, విద్యలో వెనుకబడ్డవారికి ప్రత్యేక బోధన, మానిటరింగ్ విధానం చట్టంకు అనుగుణంగా ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ వచ్చాయి. అందులో భాగమే చట్టం వచ్చాక ఆసర్ నివేదికలు విద్యార్థులు  నేర్చుకునే  సామర్థ్యాలలో  వెనుకబడినట్లు నివేదికలు ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా టెట్ లాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ,  ఉపాధ్యాయ విద్యలో, ఉపాధ్యాయ శిక్షణలో చట్టం అనుగుణమైన  మార్పులు చేర్పులుపై ప్రభుత్వాలుగానీ, అధికారులుగానీ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. 

ఇక విద్యాహక్కు చట్టం ప్యాట్రన్ ప్రకారం 2+3+3+4  ఇంటర్ విద్యను పాఠశాలలో  ప్రవేశపెట్టాలి. ఆఊసే లేదు.  విద్యాహక్కు చట్టం సెక్షన్ 13 ప్రకారం 6-–14 సంవత్సరాల వయస్సులో చదువుకునే విద్యార్థులకు నాన్-డిటెన్షన్ విధానం అమలు జరపాలని, సెక్షన్ 6 ప్రకారం విద్యార్థులు తమవయస్సు ఆధారిత తరగతిలో ఉండాలని చట్టం స్పష్టంగా నిర్దేశిస్తుంది.

చట్టం అమలుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి

 కేంద్ర ప్రభుత్వం ఆసర్ నివేదిక సాకుగా చూపి,  గీతాబుక్కల్ కమిటీ చేసిన ఓ చిన్న వెసులుబాటును ఆసరాగా 5,8 తరగతులకు డిటెన్షన్ విధానం అమలు జరపాలని ప్రకటించింది. అమలు జరిపే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలపై మోపింది. అయితే, గీతాబుక్కల్ కూడా తమ నివేదికలో  డిటెన్షన్ విధానం అమలు జరపాలని స్పష్టంగా చెప్పలేదు. ఆమెకూడా విద్యా హక్కు చట్టం అమలులో జరుగుతున్న లోపాలను వివరించే సందర్భంలో చివరి అంశంగా డిటెన్షన్ విధానం తీసుకు రావడంపట్ల జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పారు. 

కానీ, కేంద్రం ఈవిషయంలో 5, 8 తరగతులకు డిటెన్షన్ అమలు జరపాలని స్పష్టంగా ప్రకటించింది. మన తెలుగు రాష్ట్రాలలోనైతే 1971ప్రాంతంలోనే డిటెన్షన్ అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఈ విధానం ఎత్తివేయడం జరిగింది. 2007లోనే  ఏడవతరగతి కామన్ పరీక్ష కూడా ఎత్తేసుకున్నాం. డిటెన్షన్ విధానం ఎత్తివేసిన తర్వాతనే పాఠశాల మానివేసే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

 అయితే కేంద్రప్రభుత్వం 5, 8 తరగతులకు తిరిగి డిటెన్షన్ విధానం ప్రవేశపెడితే విద్యాహక్కు చట్టం సెక్షన్ 6 నిర్దేశించిన వయస్సు ఆధారిత తరగతి అనే నిబంధనకు తిలోదకాలు ఇచ్చినట్లే! అంతేకాదు! విద్యాహక్కు చట్టం నిర్వచించిన వయస్సు ఆధారిత సామర్థ్యాలు అందజేత, 6-–14 వయస్సు పిల్లలకు నిర్భందోచిత ప్రాథమిక విద్య అనబడే విద్యాహక్కు చట్టం మూల సూత్రంకు మంగళం పాడినట్లే అవుతుంది. 

కనుక ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు అన్ని విద్యాసంస్థలు చట్టబద్ధమైన విద్యాహక్కు ఖచ్చితంగా అమలు జరపడానికి ఓ వ్యవస్థను ఏర్పరచాలి.  చట్టం అమలుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  విద్యాహక్కు చట్టం  పటిష్టంగా అమలు జరిపి తీరితేనే  సమాన విద్యావకాశాలు సమాజానికి అందుతాయి. కనుక ఆ దిశగా అడుగులు పడాలని ఆశిద్దాం.---

- ఎన్ తిర్మల్,
ఎడ్యుకేషన్​ ఎనలిస్ట్​