బ్యాంకు లాకర్ల రూల్స్​ మారాయ్​

బ్యాంకు లాకర్ల రూల్స్​ మారాయ్​

ముంబై: బ్యాంకు లాకర్ల రూల్స్​ను రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా మార్చింది. కొత్త గైడ్​లైన్స్​ జారీ చేసింది. లాకర్లకు చెల్లించే యాన్యువల్​ రెంట్​కి 100 రెట్ల దాకానే బ్యాంకులకు లయబిలిటీ (బాధ్యత) ఉంటుందని ఈ గైడ్​లైన్స్​లో పేర్కొంది. ఫైర్​, దొంగతనం, భవనం కూలిపోవడం, బ్యాంకు ఉద్యోగుల మోసాలు వంటి కారణంగా లాకర్లలో దాచుకున్న వస్తువులు పోతే యాన్యువల్​ రెంట్​కి 100 రెట్ల దాకా మాత్రమే బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఈ కొత్త గైడ్​లైన్స్​ జనవరి 1, 2022 నుంచి అమలులోకి రానున్నాయి. ఇల్లీగల్​ లేదా హాని కలిగించే వాటిని లాకర్లలో ఉంచరాదనే నిబంధనను లాకర్​ ఎగ్రిమెంట్​లో చేర్చాల్సిందిగానూ బ్యాంకులకు సూచించింది. ఇప్పటికే లాకర్లు తీసుకున్న వారికీ, కొత్తగా తీసుకోబోయే వారికీ కూడా ఈ కొత్త గైడ్​లైన్స్​ వర్తిస్తాయని ఆర్​బీఐ స్పష్టం చేసింది. బ్రాంచ్​ల వారీగా ఖాళీగా ఉన్న లాకర్ల వివరాలను బ్యాంకులు మెయింటెయిన్​ చేయాలని, కోర్​ బ్యాంకింగ్​ సిస్టమ్​లో వెయిటింగ్​ లిస్ట్​ను కూడా ఉంచాలని సూచించింది. లాకర్ల అలాట్​మెంట్​లో ట్రాన్సపరెన్సీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్​బీఐ పేర్కొంది. లాకర్లకు వచ్చే అప్లికేషన్స్​ అన్నింటికీ రిసీట్​ ఇవ్వాలని, అందులో వెయిటింగ్​ లిస్ట్​ నెంబర్​ను పొందుపరచాలని ఆర్​బీఐ బ్యాంకులను ఆదేశించింది. బ్యాంకుల కోసం మోడల్​ లాకర్​ ఎగ్రిమెంట్​ను ఐబీఏ రూపొందించాలని సూచించింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్లు నాశనమైతే బ్యాంకులకు ఎలాంటి బాధ్యతా ఉండదని కూడా స్పష్టం చేసింది.