
ట్వెల్త్ ఫెయిల్, సెక్టార్ 36 లాంటి హిందీ చిత్రాలతో మెప్పించిన విక్రాంత్ మస్సే హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’. రాశీ ఖన్నా, రిద్ధి డోగ్రా హీరోయిన్స్. గోద్రా రైలు దహనం, గుజరాత్ అల్లర్ల ఆధారంగా రంజన్ చందేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఏక్తాకపూర్ నిర్మాత. శుక్రవారం టీజర్ను రిలీజ్ చేశారు. విక్రాంత్ పాత్రకు రెండు కోట్ల జరిమానాతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలనే కోర్టు ఆదేశాలతో టీజర్ మొదలైంది. ఆ జరిమానా దోషులు చెల్లిస్తారు, తాను కాదని సమర్థించుకుంటాడు విక్రాంత్. సీన్ కట్ చేస్తే 2002 ఫిబ్రవరి 27 ఉదయం గోద్రాలో జరిగిన సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు దహనం ఇన్సిడెంట్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి.. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులైన విక్రాంత్, రాశీఖన్నా ప్రయత్నిస్తుంటారు.
2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన టెర్రరిస్ట్ దాడితో ఈ సంఘటనను పోల్చి చెబుతుంటారు. ఓవైపు హృదయాన్ని కదిలించే ప్రమాద దృశ్యాలు, మరోవైపు మతపరమైన ఉద్రిక్తతలు, ఇంకోవైపు ఆ ఘటన చుట్టూ అలుముకున్న రాజకీయాల నేపథ్యంలో అసలు నిజం ఏమిటి అనే కోణంలో ఈ సినిమా ఉండబోతోందని అర్థమవుతోంది. నవంబర్ 15న థియేటర్స్లో సినిమా విడుదల కానుంది.