
హైదరాబాద్ : నిజాం కాలేజీ విద్యార్థులతో రెండోసారి జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో తమ నిరసనను కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. యూజీ, పీజీ విద్యార్థులకు సమానంగా హాస్టల్ కేటాయిస్తామని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. అయితే.. తమకు వసతి గృహంలో మొత్తం గదులు కేటాయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను కమిషనర్ నవీన్ మిట్టల్ తిరస్కరించారు. రేపటి నుండి యధావిధిగా తమ నిరసనలను కొనసాగిస్తామని విద్యార్థులు చెప్పారు.
అంతకుముందు.. హాస్టల్ సమస్య పరిష్కారం కోసం టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో నిజాం కాలేజీ విద్యార్థినుల చర్చలు జరిపారు. కొత్తగా నిర్మించిన హాస్టల్ లో 50 శాతం పీజీ విద్యార్థినులకు, మరో 50 శాతం యూజీ విద్యార్థినులకు కేటాయిస్తామని నవీన్ మిట్టల్ ప్రతిపాదించారు. దీంతో విద్యార్థినులు కాలేజీకి వెళ్లి మిగిలిన వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తోటి విద్యార్థినులతో మాట్లాడిన అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటించారు. చర్చలు విఫలం కావడంతో రేపటి నుంచి తమ నిరసనలు కొనసాగిస్తామని చెప్పారు.
అసలేం జరిగిందంటే..?
నిజాం కాలేజీలో కొత్తగా నిర్మించిన గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ను యూజీ విద్యార్థినులకు కేటాయించాలంటూ గత కొన్ని రోజులు ఆందోళన చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ జోక్యంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిజాం కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ అభ్యర్థన మేరకు 10 మంది విద్యార్థినులు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో సమావేశమై సమస్యపై చర్చించారు. కానీ, చర్చలు మాత్రం సఫలం కాలేదు.