
- సెన్సెక్స్ 412 పాయింట్లు అప్
న్యూఢిల్లీ: బెంచ్మార్క్ ఇండెక్స్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మార్చకపోవడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఈ వారంలో చివరి సెషన్ను పాజిటివ్గా ముగించగలిగాయి. కానీ, వ్యవస్థలోని లిక్విడిటీని కరోనా ముందు స్థాయిలకు తీసుకొస్తామని ఆర్బీఐ ప్రకటించింది. ఇన్ఫ్లేషన్ అంచనాలను కూడా పెంచింది. దీంతో దేశంలోని బాండ్ ఈల్డ్లు బాగా పెరిగాయి. మార్కెట్లపై దీని ప్రభావం ఉంటుందని ఎనలిస్టులు అంటున్నారు. శుక్రవారం సెషన్లో సెన్సెక్స్ 412 పాయింట్లు (0.70 %) పెరిగి 59,447 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 145 పాయింట్లు (0.82 %) ఎగిసి 17,784 దగ్గర ముగిసింది. ఎఫ్ఎంసీజీ, మెటల్, పవర్, ఆయిల్ సెక్టార్ ఇండెక్స్లు ఎక్కువగా పెరిగాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం సెషన్లో 75.76 వద్ద సెటిలయ్యింది.
మార్కెట్లు పెరగడానికి కారణాలివే..
1) అనుకున్నట్టుగానే ఆర్బీఐ..
ఆర్బీఐ ఎంపీసీ పాలసీ అంచనాలకు అనుగుణంగా ఉండడంతో మార్కెట్లు లాభపడ్డాయని ఎనలిస్టులు అన్నారు. ఆర్బీఐ పాలసీ మీటింగ్ వలన గత 2–3 సెషన్లలో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. వడ్డీ రేట్లను మార్చకపోవడం, ఎటువంటి నెగెటివ్ వార్తలు లేకపోవడంతో మార్కెట్ లాభపడిందని చెప్పారు. ఆర్బీఐ అకామిడేటివ్ (పాలసీ సులువుగా) వైఖరితో ఎక్కువగా లాభపడేది బ్యాంకులని అన్నారు. క్రెడిట్ గ్రోత్ పెరగడంతో పాటు, బ్యాలెన్స్ షీట్ మెరుగుపడడంతో బ్యాంకులు అవుట్ లుక్ బాగుందన్నారు.
2) ఎఫ్పీఐలు తిరిగొస్తున్నారు..
విదేశీ ఇన్వెస్ట్మెంట్లు (ఎఫ్పీఐలు) తిరిగి మార్కెట్లోకి వస్తుండడంతో ఇండెక్స్లు లాభపడుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు రూ. 12,202 కోట్లను విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లో పెట్టారు. కానీ, సెన్సెక్స్ ఈ ఏడాది ఫిబ్రవరి 23 లో రికార్డ్ చేసిన లెవెల్తో పోలిస్తే ఇంకా 2.9 శాతం తక్కువకే ట్రేడవుతోంది.
3) యురోపియన్ మార్కెట్లు పైకి..
వరస సెషన్లలో నష్టపోయిన యురోపియన్ మార్కెట్లు శుక్రవారం లాభపడ్డాయి. యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీని కఠినం చేయాలని చూస్తోంది. దీంతో అక్కడి మార్కెట్లు గత కొన్ని సెషన్ల నుంచి నష్టపోతున్నాయి. స్టాక్స్ యూరప్ 600 శుక్రవారం ఒక శాతం పెరిగింది.
4) రిటైల్ ఇన్వెస్టర్లు తెగ కొంటున్నారు..
ప్రతి రోజు సగటున లక్ష మంది కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి వస్తున్నారని ఈక్వినామిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ ఫౌండర్ జీ చోక్కలింగమ్ అన్నారు. ఇంకో 1–2 నెలల్లో మార్కెట్లో స్టెబిలిటీ వస్తుందని చెప్పారు. రిటైల్ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ఫండ్స్ నుంచి కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లకు సపోర్ట్ లభిస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు.