- హనుమకొండ జిల్లా ఉనికిచెర్ల శివారులో మట్టి దందా
- డయల్ 100కు కాల్ చేయగా.. పట్టుకున్న పోలీసులు
- స్టేషన్ కు వెళ్లే మార్గంలోనే తప్పించుకున్నారని ప్రకటన
హనుమకొండ, ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో మట్టి మాఫియా ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. శనివారం పోలీసులు పట్టుకున్న వాహనాలు వారి కండ్లు గప్పి కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తున్నది. ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులోని ఓ చెరువులో మండలానికి చెందిన మట్టి దందా వ్యాపారి శనివారం రాత్రి తవ్వకాలు మొదలుపెట్టాడు. రాత్రికి రాత్రి ఒక హిటాచీతో పాటు నాలుగు టిప్పర్లు, కాపలా మనుషులను పెట్టుకుని దందా సాగిస్తున్నాడు. కాగా రాత్రి సమయంలో మట్టి లోడ్ వాహనాలు దేవన్నపేట క్వార్టర్స్ మీదుగా ఓవర్ స్పీడ్ తో వెళ్తుండడంతో స్థానికులు ‘డయల్ 100’కు కాల్ చేశారు. దీంతో అరగంట తర్వాత ధర్మసాగర్ పోలీసులు చెరువు వద్దకు చేరుకుని, వారికి ఎలాంటి పర్మిషన్ లేకుండానే మట్టిని తవ్వుతున్నట్లు గుర్తించారు.
అప్పటికే బండ్ల ఓనర్ నంటూ అక్కడకు ఓ వ్యక్తి చేరుకోగా.. మట్టి తవ్వకాలకు సంబంధించి పర్మిషన్ కాపీ చూపించాలని పోలీసులు అడిగారు. వారి వద్ద ఎలాంటి పర్మిషన్లు, ఎన్వోసీలు లేవని నిర్ధారించుకుని వాహనాలు ఫొటోలు తీసుకున్నారు. నాలుగు టిప్పర్లు, ఒక హిటాచీని స్టేషన్కు తరలించాల్సిందిగా సూచించారు. అనంతరం లారీలు ముందు వెళ్తుంటే.. పోలీస్ వాహనం వారిని అనుసరిస్తూ వెళ్లింది. కానీ మట్టి తరలిస్తున్న వాహనాలు మాత్రం స్టేషన్కు చేరలేదు. వాటిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. దేవన్నపేట రింగ్ రోడ్డు ఎక్కిన తర్వాత తప్పించుకు పారిపోయారని పోలీసులు చెప్తుండగా.. కండ్ల ముందు నుంచి లారీలు ఎలా మాయమవుతాయనే స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేయాల్సిన పోలీసులు వాహనాలను కావాలనే తప్పించారా.. అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై ధర్మసాగర్ సీఐ రమేశ్ ను వివరణ కోరగా.. అసలు మట్టి లారీలు పట్టుకున్న విషయం తన దృష్టికి రాలేదని సమాధానం ఇచ్చారు.