- గిరిజన ఆశ్రమ హాస్టల్ డైలీ వేజ్ వర్కర్ కొడుకు ఆవేదన
- ఎనిమిది నెలలుగా పెండింగ్లో సాలరీ
జైనూర్, వెలుగు : తన తండ్రికి సకాలంలో జీతం అందకపోవడంతో ఆయన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయానని గిరిజన ఆశ్రమ హాస్టల్ డైలీ వేజ్ వర్కర్ కొడుకు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో జరిగింది. మార్లవాయి గిరిజన ఆశ్రమ హాస్టల్ లో డైలీ వేజ్ వర్కర్ గా పని చేస్తున్న మెస్రం జంగు (52) నాలుగు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయినా ఆయనకు నయం కాలేదు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం మంచి ఆస్పత్రికి తీసుకెళ్దామని భావించినా అందుకు సరిపడా డబ్బు లేదు.
ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న జీతం వస్తే ప్రైవేట్ ఆస్పత్రికి తరలిద్దామని చూసినా ఆ డబ్బులు రాకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో జంగు మంగళవారం చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు, వర్కర్లు, యూనియన్ లీడర్లు జంగు మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆర్థిక సమస్యలతోనే ట్రీట్మెంట్ అందించక తండ్రిని కోల్పోయానని మృతుని కొడుకు మెస్రం చిన్ను రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. ‘‘సకాలంలో జీతం రాక మా నాన్నకు మెరుగైన ట్రీట్మెంట్ అందించలేకపోయాం. అంత్యక్రియలకు కూడా హాస్టల్ వార్డెన్ జైవంత్ సర్ ఆర్థిక సహాయం అందజేసి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. నాన్న జీతం పడి మెరుగైన ట్రీట్మెంట్అందిస్తే ఆయనకు ప్రాణాపాయం తెప్పేదేమో’’ అని చిన్ను బోరుమన్నాడు.