కేంద్రం నిధులను రాష్ట్రం తప్పుదోవ పట్టిస్తుంది

కేంద్రం నిధులను రాష్ట్రం తప్పుదోవ పట్టిస్తుంది
  • కేంద్రం నిధులను రాష్ట్రం తప్పుదోవ పట్టిస్తుంది
  • కవిత పసుపు రైతులకు చేసింది శూన్యం
  • కేసీఆర్ సర్కార్ అవినీతి సర్కార్..

నిజామాబాద్ జిల్లా: 8 సంవత్సరాల మోడీ పాలనలో దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందన్నారు కేంద్ర మంత్రి మహేంద్రనాధ్ పాండే. సోమవారం ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సేవ, గరీబ్ కళ్యాణ్, అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల సేవకు అంకితమని.. మోడీ ప్రభుత్వం అవినీతి లేని ప్రభుత్వమన్నారు. కొత్త ఆలోచనలతో కేంద్రం ముందుకు సాగుతుందన్న మహేంద్రనాధ్..భారత దేశ వ్యతిరేక శక్తులను సమర్థ వంతంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్ దేశ చరిత్రలో మైలురాయని గుర్తు చేశారు. కోవిడ్ నివారణలో ప్రపంచ దేశాలకు భారత్ స్ఫూర్తిగా నిలిచిందని.. పాండమిక్ లోను ఆర్థిక వృద్ధి సాధించామని చెప్పారు. కోవిడ్ సమయంలోను పథకలు, బడ్జెట్ ఆపలేదన్న కేంద్రమంత్రి.. మోడీ పాలనలో ఇండియా ప్రపంచ దేశాల్లో బలమైన దేశంగా ఎదిగిందన్నారు. రైతులకు, యువతకు, మహిళలకు ప్రత్యేక పథకాలు తెచ్చామని.. మోడీ పాలనతో బీజెపి దేశ వ్యాప్తంగా బలపడిందన్నారు.

తెలంగాణాలో 40 లక్షల మంది రైతులకి కిసాన్ సమ్మాన్ నిధితో లబ్ది చేకూరిందని తెలిపారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పసుపు రైతులకు కేంద్రం స్ప్రెస్ బోర్డు ద్వారా లబ్ది చేకూర్చిందని.. పసుపు ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేశామని చెప్పారు. పసుపు దిగుమతి నిలిపేసి, ఎగుమతులు పెంచటం ద్వారా ధరలు పెరిగేలా చేశామని.. పసుపు ఎగుమతుల కోసం ప్రత్యేక రైళ్లనూ ఏర్పాటు చేశామని అన్నారు.  2 సంవత్సరాలుగా బంగ్లాదేశ్ కి పసుపుని ఎగుమతి చేస్తున్నామన్న ఆయన.. కవిత ఎంపీగా ఉన్న 5 సంవత్సరాల్లో పసుపు రైతులకు చేసింది శూన్యం అని ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చిన సర్వ శిక్ష అభియాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని సీరియస్ అయ్యారు. తెలంగాణలో స్కూల్స్ దారుణంగా ఉన్నాయన్న మహేంద్రనాధ్ పాండే.. కేంద్రం నిధులు తప్పుదోవ పడుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని.. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగాయని.. ఆయుష్మాన్ భారత్, ఫసల్ బిమా యోజన లాంటి పథకాలను అమలు చేయకుండా పేదలకు లబ్ది లేకుండా చేస్తోందని తెలిపారు. 

కేసీఆర్ సర్కార్ అవినీతి సర్కార్..

రానున్న రోజుల్లో మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని.. కాంగ్రెస్ అవినీతి వల్లే దశాబ్దాలుగా దేశం వెనుకబడిందన్నారు. ఆత్మనిర్బర్ భారత్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని..కేసీఆర్ కేంద్రంతో సయోధ్య లేకుండా మొండిగా, అహంకారంగా పాలన చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఫలాలు ఇక్కడి ప్రజలకు అందలేదని.. కేంద్రం నుండి వచ్చే నిధులను రాష్ట్రం దుర్వినియోగం చేస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. మమత బెనర్జీ చాలా రోజులుగా బీజేపీ వ్యతిరేఖ శక్తులను ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ విఫలమవుతున్నారన్నారు. రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంప్రదాయమని కేంద్రమంత్రి మహేంద్రనాధ్ పాండే తెలిపారు.