
ఢిల్లీ : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేటస్ రిపోర్టులో ఎక్కడ చూసినా రాజకీయ వైరం అని మాత్రమే రాశారని చెప్పింది. విచారణ అధికారిని మార్చాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.
కేసు దర్యాప్తు వేగంగా సాగడం లేదని.. దర్యాప్తు అధికారిని మార్చాలని కోరుతూ.. ఈ హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్పై గత సోమవారం (మార్చి20న ) సుప్రీంకోర్టు విచారించింది. దర్యాప్తు పురోగతిపై సీల్డ్ కవర్లో నివేదిక అందించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు అధికారి సరిగానే విచారణ చేస్తున్నారని గత వారం సుప్రీంకోర్టుకు సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ తెలిపారు.
విచారణ సందర్భంగా.. వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత సోమవారం (మార్చి 20న) వాదనల సందర్భంలో.. వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయడం లేదని కోర్టు సీబీఐని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారని అడిగింది. విచారణ త్వరగా ముగించలేకపోతే మరో దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని ప్రశ్నించింది.