V6 News

తాళం వేసిన ఇండ్లు, ఆఫీస్‎లే టార్గెట్.. చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్

తాళం వేసిన ఇండ్లు, ఆఫీస్‎లే టార్గెట్.. చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: తాళం వేసిన ఇండ్లు, ఆఫీస్‎లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని బాలానగర్ పోలీసులు అరెస్ట్​చేశారు. సంబంధిత వివరాలను డీసీపీ సురేశ్​కుమార్​మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఏపీలోని బాపట్లకు చెందిన గోనిగుంట వంశీకృష్ణ(32) బతుకుదెరువు కోసం జగద్గిరిగుట్ట అల్విన్​కాలనీకి వచ్చాడు. క్యాబ్​డ్రైవర్​గా పని చేస్తున్నాడు. వెస్ట్​గోదావరి జిల్లా పెద్దపాడు మండలం వల్తూరుకు చెందిన మట్ట భరత్ రాజీవ్​గాంధీ అలియాస్​భరత్​కూడా ఇదే కాలనీలో ఉంటూ బైక్​మెకానిక్‎గా చేస్తున్నాడు. 

ఇద్దరూ జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం చోరీలు చేయాలని నిర్ణయించుకొని, తాళం వేసిన ఇండ్లు, ఆఫీస్​లను టార్గెట్​చేస్తున్నారు. ఈ నెల 2న బాలానగర్​లోని లిఫ్ట్​ట్రేడ్​ప్రైవేట్​లిమిటెడ్ షట్టర్​ తాళాలు పగులగొట్టి రూ.4 లక్షలు ఎత్తుకెళ్లారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులు  వంశీకృష్ణ, భరత్​ను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, జగద్గిరిగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలో 4, కేపీహెచ్​బీ ఠాణా పరిధిలో 1, మియాపూర్​ఠాణా  పరిధిలో1 మొత్తం 7 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు.  వారి వద్ద నుంచి రూ.2.27 లక్షలు,  బైక్​, వాచ్, 53 గ్రాముల గోల్డ్​కోటెడ్​సిల్వర్ గాజులు, రోల్డ్​గోల్డ్​నెక్లెస్, 2 ఫోన్లు, 2 ఐరన్​రాడ్లను స్వాధీనం చేసుకొని ఇద్దరినీ అరెస్ట్​చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు.  బాలానగర్, కేపీహెచ్​బీ ఠాణాల పరిధిలో వారు పని చేసిన కంపెనీల్లోనే చోరీ చేశారని తెలిపారు.