
- అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు
- వచ్చే ఏడాది నుంచి పీహెచ్డీ కోర్సులు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి జిల్లా పాల్వంచలో ఏర్పాటైన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రపంచంలోనే రెండోదని అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లోని సచివాలయంలో వర్సిటీ వైస్ ఛాన్స్లర్, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణాతో మంత్రి బుధవారం సమావేశమయ్యారు. వర్సిటీ నిర్మాణ పనుల ప్రగతిపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా పాల్వంచలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిలుస్తోందన్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఆర్కిటెక్ట్ల ద్వారా భవన నిర్మాణాలకు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి పీహెచ్డీ కోర్సులను ప్రారంభించేందుకు చర్యలు చేపడ్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న మైనింగ్ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేట్, పీజీ కోర్సులు కొనసాగుతున్నాయన్నారు. పీహెచ్డీ కోర్సులు ప్రారంభించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్తో చర్చించి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. సింగరేణి, ఎన్ఎండీసీ, కోల్ ఇండియా లాంటి సంస్థల ద్వారా సీఎస్ఆర్ ఫండ్స్ను సేకరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వచ్చే వారంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి యూనివర్సిటీ నిర్మాణ ప్రణాళిక, నిధుల అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆర్కిటెక్ట్ డిజైన్ ఖర్చు అంచనాలు సిద్ధం చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.