హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు: సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గ్రామంలోని జడ్పీ హైస్కూల్ లో దొంగలు పడి కంప్యూటర్ పరికరాలు, సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు.
3 మానిటర్లు, 2 సీపీయూలు, ఒక హార్డ్ డిస్క్, ఒక మైక్రోస్కోప్ తో పాటు నిఘా కోసం ఏర్పాటు చేసిన 2 సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి క్లూస్ టీమ్ ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ ఏసీపీ సదానందం పరిశీలించారు.
కాగా, ఇదే స్కూల్లో గతంలోనూ చోరీ జరిగింది. హెచ్ఎం జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
