ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నేతల్లో టెన్షన్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నేతల్లో టెన్షన్
  • ఉమ్మడి జిల్లాలోని ఆరు సెగ్మెంట్లలో అభ్యర్థులు డిక్లేరయ్యే ఛాన్స్
  • జాబితాపై ఆశావహుల ఆరా
  • ఎంపీ అర్వింద్​ పోటీపై ఉత్కంఠ!

నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీకి పోటీ చేసే క్యాండిడేట్ల ఫస్ట్ లిస్ట్​ను బీజేపీ మరో రెండు, మూడు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉండడంతో ఆశావహుల్లో టెన్షన్​ నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం తొమ్మిది సెగ్మెంట్లలో ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చే ఛాన్స్​ ఉంది. మిగతా మూడింటిపై హైకమాండ్​ కసరత్తు కొనసాగిస్తోంది. మొదటి జాబితాలో ఎంపీ అర్వింద్​ పేరు ఉంటుందా? ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 

జాబితాలో వీరికి అవకాశం..

గెలుపు గుర్రాలను బరిలోకి దింపడానికి పార్టీ భారీ కసరత్తు చేస్తోంది. బాల్కొండ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ పేరు ఫైనల్​అయినట్లు తెలుస్తోంది. ఆమె కాదంటే ఆమె కొడుకు ఏలేటి మల్లికార్జున్​రెడ్డి పోటీ చేయనున్నారు.  అర్బన్ ​నుంచి 11 మంది టికెట్ ​రేసులో ఉండగా, ధన్​పాల్​ సూర్యనారాయణ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరో సీనియర్ ​నేత ఢిల్లీ స్థాయిలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జుక్కల్​ నుంచి మాజీ ఎమ్మెల్యే అరుణతార బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. బోధన్​ నుంచి మేడపాటి  ప్రకాశ్​రెడ్డికి ఛాన్స్​ ఇచ్చినట్లు  తెలుస్తోంది. వడ్డీ మోహన్​రెడ్డి కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. సీఎం కేసీఆర్​ పోటీ చేస్తున్న కామారెడ్డి సెగ్మెంట్​ నుంచి ఉమ్మడి జిల్లా పరిషత్​ చైర్మన్​గా పనిచేసిన వెంకట రమణారెడ్డి బరిలో నిలువనున్నారు. నిజామాబాద్​ రూరల్ ​టికెట్ ​కోసం ఆరుగురు అప్లికేషన్లు పెట్టిగా, దినేశ్ ​కులాచారి గానీ, ఆయన భార్య దివ్య గానీ పోటీ చేసే అవకాశం ఉంది. దివ్య గతంలో నిజామాబాద్​ మార్కెట్​ కమిటీ అధ్యక్షురాలిగా పనిచేశారు.  

ఎల్లారెడ్డి, బాన్సువాడపై కసరత్తు.. 

మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్​లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో ఎల్లారెడ్డి నుంచి అంతకంటే బలమైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక్కడ ఏడుగురు లీడర్లు టికెట్​కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉంది. బాన్సువాడ నుంఏచి 11 మంది అప్లై చేసుకున్నారు. వారిలో ఒకరి పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ సీనియర్​ నేతను  పంపాలన్న ప్రతిపాదనను కూడా పార్టీ పరిశీలిస్తోంది.

ఆర్మూర్​పై సందిగ్ధం..

ఎనిమిది మంది నేతలు ఆర్మూర్​ టికెట్​ఆశిస్తున్నారు. పైడి రాకేశ్​రెడ్డి, మహిళానేత ఆలూరు విజయభారతి పేర్లను పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఎంపీ అర్వింద్​ పోటీ చేసే విషయాన్ని తీసిపారేయలేని పరిస్థితి ఉంది. అర్వింద్​ లేనిపక్షంలో పైడి రాకేశ్​రెడ్డిని బరిలో నిలపాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.