
- ఈ నెల 24, 25 తేదీల్లో ప్రధాని మోదీ ప్రచారం
- కాంగ్రెస్ తరఫున రాహుల్, ప్రియాంక క్యాంపెయినింగ్
- ఇప్పటికే 64 సభల్లో పాల్గొన్న కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో పది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్జరగనుంది. 8 రోజుల్లో (ఈ నెల 25న సాయంత్రం 5 గంటలకు) ప్రచారం గడువు ముగియనుంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో మూడు ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. తమ అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడ్చుతున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ ఈ నెల 24, 25 తేదీల్లో ప్రచారానికి రానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు రాష్ట్రానికి రానున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్అభ్యర్థుల తరపున ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ఇప్పటికే 64 ప్రచార సభల్లో పాల్గొన్నారు. ప్రచారం గడువు ముగిసే నాటికి ఆయన 94 సభలతో అన్ని నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. ప్రధాన పార్టీలకు దీటుగా బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తాను పోటీ చేస్తున్న సిర్పూర్తో పాటు ఆ పార్టీ అభ్యర్థుల కోసం పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం హెలిక్యాప్టర్ను హైర్ చేసుకున్నారు. ఇతర పార్టీల నాయకులు, అభ్యర్థులు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్ షోలు, బహిరంగ సభలు, డోర్టు డోర్ క్యాంపెయినింగ్తో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
రెండు రోజులు ప్రధాని రోడ్ షోలు
ప్రధాని మోదీ ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రానికి వచ్చారు. బీసీల ఆత్మగౌరవ సభ, అణగారిన వర్గాల విశ్వరూప మహాసభల్లో పాల్గొన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో మళ్లీ రాష్ట్రానికి వచ్చి హైదరాబాద్లో రోడ్షోలు నిర్వహించడంతో పాటు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా, యూపీ, అస్సాం సీఎం యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, నితిన్గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, హుజూరాబాద్ఎమ్మెల్యే ఈటల రాజేందర్రాష్ట్రమంతా తిరుగుతూ ఆ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్రంలోనే రాహుల్ మకాం..
కాంగ్రెస్అగ్రనేత సోనియా గాంధీ తుక్కుగూడ బహిరంగ సభలో 6 గ్యారంటీలను ప్రకటించారు. తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక, ఖర్గే సహా పలువురు ముఖ్య నేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రియాంక ఆదివారం పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. రాహుల్గాంధీ రెండ్రోజుల క్రితం రాష్ట్రంలో ప్రచారం చేశారు. రెండు మూడు రోజుల్లో మళ్లీ రాష్ట్రానికి వచ్చి ఈ నెల 28 వరకు ఇక్కడే ఉండి ప్రచారం చేయనున్నారు. త్వరలో హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సుక్కు, రాజస్థాన్సీఎం అశోక్ గెహ్లాట్ సహా ఇంకొందరు నాయకులు రాష్ట్రంలో ప్రచారానికి వస్తారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరో పక్క పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు. భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు తాము పోటీ చేసే స్థానాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.
28న గజ్వేల్ సభతో కేసీఆర్ ప్రచారం ముగింపు
బీఆర్ఎస్ నేతలు 3 నెలలుగా ఫీల్డ్లోనే ఉండి ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ అక్టోబర్15న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి.. ఆదివారానికి 64 ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈనెల 28న సాయంత్రం.. తాను పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గ సభతో ఆయన ప్రచారాన్ని ముగించనున్నారు. కేటీఆర్, హరీశ్రావు రాష్ట్రమంతా చుట్టేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి నిజామాబాద్జిల్లాలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.