చిన్న నాటి నుంచే పొదుపు మొదలుపెడితే ఎన్నో ప్రయోజనాలు

చిన్న నాటి నుంచే పొదుపు మొదలుపెడితే ఎన్నో ప్రయోజనాలు

బిజినెస్​డెస్క్​, వెలుగు: బాలికలు పెద్దయ్యాక వారి  భారీ మొత్తాలను పొందడానికి  బ్యాంకులు,  పోస్టాఫీసులు చాలా పొదుపు పథకాలను అమలు చేస్తున్నాయి. తల్లిదండ్రులు వీటిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కీలకం. పెట్టుబడులు పెట్టేముందు మాత్రం ఎక్స్​పర్టులను సంప్రదించి తమ పిల్లలకు అనువైన పెట్టుబడులను ఎంచుకోవాలి.  పర్సనల్​ ఫైనాన్స్​ ఎక్స్​పర్ట్​ అమిత్​ గుప్తా  ప్రకారం బాలికల కోసం అందుబాటులో ఉన్న మంచి పథకాలు ఇవి:

సుకన్య సమృద్ధి యోజన (ఎస్​ఎస్​వై)

సుకన్య సమృద్ధి యోజన (ఎస్​ఎస్​వై) కింద 0–10 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు పిల్లల పేరు మీద ఖాతాను తెరవొచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి  15 సంవత్సరాల వరకు  నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన డిపాజిట్లు చేయవచ్చు. ప్రస్తుతం, ఎస్ఎస్​వై ఏడాదికి 7.6 శాతం వడ్డీ ఇస్తుంది.  ఎస్ఎస్​వై ఖాతాను తెరవడానికి కనీస మొత్తాన్ని రూ.1,000 నుంచి రూ.250 కి తగ్గించారు.   ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్​ చేయవచ్చు.  “ఎస్​ఎస్​వై, బాలికలకు అత్యుత్తమ పెట్టుబడి పథకం.  కమర్షియల్ బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ఎస్ఎస్​వై ఖాతా తెరవడం ద్వారా తమ కుమార్తెలకు మంచి భవిష్యత్​ను ఇవ్వవచ్చు" అని ఎస్​ఏజీ ఇన్ఫోటెక్ ఎండీ, అమిత్ గుప్తా అన్నారు.

చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్

చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ భారతదేశంలోని ఆడ పిల్లల కోసం అద్భుతమైన ప్లాన్.   దీనికి ఐదేళ్ల వరకు లాక్ ​ఇన్​ పీరియడ్​ ఉంటుంది. హయ్యర్​ ఎడ్యుకేషన్​ వంటి అవసరాల కోసం ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీరేటు ఏడు శాతానికి పైగా ఉంటుంది. 

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్  

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్​ను పోస్టాఫీసులు అందిస్తాయి. ఇది తక్కువ- రిస్క్ గల ప్రభుత్వ పథకం. ఎన్ఎస్​సీలో చాలా ఆకర్షణలు ఉంటాయి. బాలికలకు అనువుగా ఉంటుంది.  దీనిపై ఏటా ఏడుశాతం వడ్డీ ఇస్తారు. 
యూనిట్ లింక్డ్‌ ఇన్సూరెన్స్ ప్లాన్  ఆడ పిల్లల కోసం అందుబాటులో ఉన్న  గొప్ప ప్లాన్‌‌‌‌లలో ఒకటని గుప్తా అంటారు.  ఈ ప్లాన్ అద్భుతమైన రాబడిని అందిస్తుంది. ఇందులో లైఫ్​ఇన్సూరెన్స్​తోపాటు పెట్టుబడి ప్రయోజనాలూ ఉంటాయి. 

సీబీఎస్​ఈ ఉడాన్ పథకం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి (హెచ్​ఆర్​డీ) మంత్రిత్వ శాఖ సహకారంతో బాలికల కోసం సీబీఎస్​ఈ ఉడాన్ పథకాన్ని  నిర్వహిస్తుంది. ప్రతిష్టాత్మక కాలేజీల్లో చేరే విద్యార్థినులకు దీని ద్వారా స్కాలర్​షిప్స్​ ఇస్తారు. ప్రీ, పోస్ట్​మెట్రిక్​స్కాలర్​షిప్స్​ కూడా ఉంటాయి.