మోడీ సర్కార్‌ను దెబ్బతీసేందుకు కుట్ర

మోడీ సర్కార్‌ను దెబ్బతీసేందుకు కుట్ర

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసేలా కుట్ర జరుగుతోందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. యూఎస్ మాజీ ఎన్‌ఎస్‌‌ఏ హెచ్.ఆర్.మెక్‌మాస్టర్‌తో జరిగిన సంభాషణలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. మోడీ ప్రభుత్వాన్ని దెబ్బతీసేలా కొందరు కావాలని చిత్రిస్తున్న దుష్ప్రచారాలకు, ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన రికార్డుల్లో చాలా వ్యత్యాసం ఉందన్నారు. కరోనా వల్ల నెలకొన్న కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న భారత్‌కు.. ఇది ఒత్తిడితో కూడిన సమయం అన్నారు. ఈ పరిస్థితులను సర్కార్ విజయవంతంగా ఎదుర్కొంటోందని, ఈ క్రమంలో ప్రభుత్వానికి ప్రజలు సహకారం అందించడం ముఖ్యమని పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు మోడీ ప్రభుత్వం ఉచితంగా ఆహారాన్ని అందిస్తోందని, గతేడాది కూడా పలు నెలలపాటు ఫుడ్‌‌ను అందించిందని చెప్పారు. దీంతోపాటు 40 కోట్ల మంది ప్రజల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయంగా డబ్బులను వేసిందన్నారు. ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా కొందరు కావాలనే కుట్రలు పన్ని సర్కార్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.