సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం 4 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతేడాది కోవిడ్ బారిన పడిన తర్వాత..కైకాల అనారోగ్యానికి గురైనట్లు  తమ్ముడు కైకాల నాగేశ్వర రావు చెప్పారు. కైకాల అంత్యక్రియలను శనివారం మహాప్రస్థానంలో నిర్వహిస్తామని వెల్లడించారు. అభిమానుల సందర్శనార్థం ఉదయం 11 నుంచి కైకాల పార్థీవదేహాన్ని ఉంచుతామన్నారు. కైకాల కుమార్తె చెన్నైలో ఉందని..ఆమె రావాల్సి ఉందన్నారు. 

కైకాల సత్యనారాయణ దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. కైకాల సత్య నారాయణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. కైకాల సత్యనారాయణ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. 87ఏళ్ల సత్యనారాయణ 60 ఏళ్ల సినీజీవితాన్ని అనుభవించారు. కైకాల సత్యనారాయణ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, క‌మెడియ‌న్ ఇలా అన్నీ ర‌కాల ప్రాత‌ల‌ను పోషించి త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు స‌త్యనారాయ‌ణ‌. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు. 

కైకాల సత్యనారాయణ 1935 జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు. విజయవాడ, గుడివాడలో విద్యాభ్యాసం చేశారు. కైకాల సత్యనారాయణ నవరస నటసార్వభౌమగా పేరుగాంచారు. 1960లో కైకాల నాగేశ్వరమ్మల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు,ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 1959లో సిపాయి కూతురు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.  ముఖ్యంగా యుముడి పాత్రతో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. రేపు మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు జరగనున్నాయి.