- ఆర్డర్స్ లేక జరగని ప్రొడక్షన్
- కరోనాతో నష్టపోతున్న వ్యాపారులు
హైదరాబాద్, వెలుగు: జెండా పండుగంటే దేశమంతటా ఎక్కడా లేని జోష్ పుట్టుకొస్తుంది. వాడవాడలా తిరంగ జెండాలు రెపరెపలాడుతుంటాయి. ఆగస్టు మొదటి వారం నుంచే జెండాలను తయారు చేసే ప్రింటింగ్ ప్రెస్లకు ఆర్డర్లు వస్తుంటాయి. కానీ, కరోనా మహమ్మారితో నిరుడు మార్చి నుంచి ఆ జెండా పండుగ కళ తప్పింది. లాక్డౌన్, స్కూళ్లు మూతపడడం వంటి కారణాలతో పెద్దగా వేడుకలను నిర్వహించట్లేదు. దీంతో జెండాలకు గిరాకీ తగ్గిపోయింది. ఈ ఏడాదీ అదే పరిస్థితి. ఆర్డర్లు లేక బిజినెస్ దారుణంగా దెబ్బతిన్నదని హైదరాబాద్లోని ప్రింటింగ్ప్రెస్ ఓనర్లు వాపోతున్నారు. మామూలుగా జులై, ఆగస్ట్, డిసెంబర్, జనవరి నెలల్లో హైదరాబాద్లోని ప్రింటింగ్ ప్రెస్లలో జెండాలను తయారు చేస్తుంటారు. లక్షల సంఖ్యలో చిన్నా..పెద్ద జెండాలను తయారు చేసేవారు. కూలీలను నియమించుకుని తిరంగాలను ప్రింట్ చేసేవారు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వ్యాపారులు చెబుతున్నారు. గిరాకీ లేక ప్రొడక్షనే చేయట్లేదన్నారు. గత ఏడాది డిసెంబర్లో గ్రేటర్ ఎన్నికలతోనూ రిపబ్లిక్ డే కోసం ఎక్కువగా జెండాలు తయారు చేయలేదని అంటున్నారు. త్వరలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉండడంతో.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని చెబుతున్నారు. జెండాలతో పాటు పార్టీల నేతల పేర్లు, ఫొటోలతో మాస్కుల కోసమూ ఆర్డర్లు పెడ్తున్నారని అంటున్నారు.