- రంగారెడ్డిపై ఆదిలాబాద్ జిల్లా విజయం
- గెలుపొందిన కరీంనగర్, నల్లగొండ జట్లు
హైదరాబాద్, వెలుగు: కాకా మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ రెండో ఫేజ్లో రూరల్ క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. విశాక ఇండస్ట్రీస్ స్పాన్సర్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ హైదరాబాద్లో మంగళవారం రెండో రోజు కొనసాగింది. ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియం, జింఖానా గ్రౌండ్లో జరిగిన మ్యాచుల్లో హైదరాబాద్కు నిజామాబాద్ జిల్లా జట్టు షాకివ్వగా.. రంగారెడ్డి జిల్లాపై ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది.
అదేవిధంగా.. కరీంనగర్, నల్లగొండ జట్లు గెలుపొందాయి. ఉప్పల్ స్టేడియంలో ఉదయం జరిగిన మ్యాచ్లో నిజామాబాద్ జట్టు 39 రన్స్ తేడాతో హైదరాబాద్పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నిజామాబాద్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విక్రమ్ జాదవ్ (33 బాల్స్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 నాటౌట్), హర్షవర్ధన్ (30 బాల్స్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 53) సత్తా చాటారు.
లక్ష్య ఛేదన లో భాగంగా బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 144 రన్స్ మాత్రమే చేసింది. లోకేశ్ యాదవ్ (25) టాప్ స్కోరర్గా నిలిచాడు. నిజామాబాద్ బౌలర్లు ప్రతీక్ (3/30), లలిత్ (3/31) చెరో 3 వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. విక్రమ్ జాదవ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్
అవార్డు లభించింది.
మెదక్పై కరీంనగర్ ఉత్కంఠ విజయం
కరీంనగర్ టీమ్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో మెదక్ జట్టును ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన మెదక్ 18.5 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది. కరీంనగర్ బౌలర్ శౌమిక్ కపూర్ (3/26) వికెట్లు పడగొట్టాడు. అనంతరం కరీంనగర్ జట్టు 17.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకున్నది.
ఓపెనర్లు తక్షిల్ (33), రాజు (23) జట్టును ఆదుకున్నారు. మెదక్ బౌలర్ అఖిల్ (3/17) వికెట్లు తీసినప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. శౌమిక్ కపూర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. అతనికి కరీంనగర్ జిల్లా సెక్రటరీ ఆగం రావు అవార్డు అందజేశారు.
నల్లగొండ పరుగుల మోత
జింఖానా వేదికగా జరిగిన పోరులో ఫోర్లు, సిక్సర్ల మోత మోగించిన నల్లగొండ జట్టు 67 పరుగుల భారీ తేడాతో ఖమ్మంపై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన నల్లగొండ 20 ఓవర్లలో 223/5 భారీ స్కోరు చేసింది. ఆది మణి కిరణ్ (47 బాల్స్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 73), సాయినాథ్ (32 బాల్స్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 64) మెరుపు ఇన్నింగ్స్లతో ఖమ్మం బౌలర్లపై విరుచుకుపడ్డారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఖమ్మం.. 19.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. రిజ్వాన్ (53), వంశీ (45) పోరాడినా ఫలితం లేకపోయింది. నల్లగొండ బౌలర్లలో శివుడు 3 వికెట్లు, సాయినాథ్ 2 వికెట్లు తీశారు. ఆల్రౌండర్ పెర్ఫామెన్స్ చేసిన సాయినాథ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
రంగారెడ్డిపై ఆదిలాబాద్ పైచేయి
జింఖానా మైదానంలో జరిగిన పోరులో ఆదిలాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో రంగారెడ్డి జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి జట్టు 19.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌట్ అయింది. సాయి దేవేశ్ (40) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆదిలాబాద్ బౌలర్ ఇస్మాయిల్ అహ్మద్ (4/22) 4 వికెట్లతో రాణించాడు.
అనంతరం ఆదిలాబాద్ జట్టు 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సంతోష్ (51) హాఫ్ సెంచరీ చేయగా, మహమ్మద్ అస్ఫాన్ (48) రాణించి ఆదిలాబాద్ను గెలిపించారు. ఇస్మాయిల్ అహ్మద్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
