పోలవరంపై ఈసారీ చర్చ లేదు.. ఏపీలోని మిత్రుల కోసమేనా..?

పోలవరంపై ఈసారీ చర్చ లేదు.. ఏపీలోని మిత్రుల కోసమేనా..?
  • ప్రగతి మీటింగ్‌‌కు రెండు గంటల ముందు ఎజెండా నుంచి తొలగింపు ​
  • గత నెల మీటింగ్‌‌ టైమ్‌‌లోనూ ఇలాగే తొలగించిన కేంద్రం
  • ఏపీలోని మిత్రపక్షం కోసమని అనుమానాలు
  • సీడబ్ల్యూసీ సర్వే చేయిస్తామన్నా.. అదీ అతీగతీ లేదు  
  • కేంద్రం తీరుపై రాష్ట్ర సర్కార్ అసంతృప్తి 

హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్టు బ్యాక్​వాటర్‌‌‌‌‌‌‌‌‌‌తో తెలంగాణలో కలిగే ముంపు ముప్పుపై కేంద్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నది. ముంపుపై ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) మీటింగ్, జీఆర్ఎంబీ మీటింగుల్లో మన వాదన వినిపించగా.. సీడబ్ల్యూసీతో సర్వే చేయిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగే ప్రగతి మీటింగ్‌‌‌‌లో భాగంగా పోలవరం ప్రాజెక్టుపై చర్చిస్తామని ఎజెండా పెడుతున్నా.. తీరా మీటింగ్‌‌‌‌కు ముందు ఆ అంశాన్నే ఎత్తేస్తున్నది. 

గత నెల 24న ప్రగతి మీటింగ్‌‌‌‌లో దీనిపై చర్చించాల్సి ఉన్నా.. మీటింగ్‌‌‌‌కు రెండు రోజుల ముందు ఆ అంశాన్ని తీసేసింది. తాజాగా బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ప్రగతి మీటింగ్‌‌‌‌లోనూ పోలవరం అంశాన్ని ఫస్ట్​ఎజెండా ఐటెంగా కేంద్రం మెన్షన్​చేసింది. మీటింగ్​సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. దానికి కేవలం రెండు గంటల ముందు ఆ అంశాన్ని ఎజెండా నుంచి ఎత్తేసింది. 

ఏపీలోని మిత్రుల కోసమేనా..? 

పోలవరం బ్యాక్ వాటర్ ముంపుతో తమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆది నుంచి తెలంగాణ వాదిస్తున్నది. అందుకు అనుగుణంగా ప్రధాని ముందు అభ్యంతరాలను తెలియజేసేందుకు మన అధికారులు ఎజెండా అంశాలనూ సిద్ధం చేశారు. అయితే ప్రగతి మీటింగ్​నుంచి పోలవరం అంశాన్ని ఎత్తేయడంతో ప్రధాని వద్ద చర్చించే అవకాశం లేకుండా పోయింది. దీనిపై ప్రభుత్వం, అధికారులు గుర్రుగా ఉన్నారు. మీటింగ్‌‌‌‌లో చర్చిస్తామని చెప్పడమెందుకు.. అజెండా తయారు చేశాక తీరా సమావేశం ముందు దానిని ఎత్తేయడం ఎందుకు అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

అయితే, కేంద్ర ప్రభుత్వం పోలవరం అంశాన్ని మీటింగ్​నుంచి సడెన్‌‌‌‌గా తొలగించడం వెనుక ఏపీలోని తన మిత్రులకు సహకరించేందుకేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో జరిగిన ప్రగతి మీటింగ్​నుంచి పోలవరం అంశాన్ని తొలగించడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగి ఉంటుందన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ఏర్పడే ముంపుపై చర్చించాల్సి వస్తుందనే ఆ అంశాన్ని తెలివిగా తొలగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలవరం బ్యాక్​వాటర్‌‌‌‌‌‌‌‌తో రాష్ట్రంలో ఏర్పడే ముంపు ప్రభావంపై జాయింట్​సర్వే చేయించాలని మన ప్రభుత్వం డిమాండ్​చేస్తున్నా.. ఏపీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో చేయిస్తామని కేంద్రం చెప్పినా.. ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.  

ప్రాజెక్టుతో ఇదీ సమస్య..

పోలవరం ప్రాజెక్టును వాస్తవానికి 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. అయితే, ఆ ఎత్తుతో నిర్మించి పూర్తిస్థాయిలో నీటిని స్టోర్ చేస్తే ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌‌‌‌‌‌‌‌తో ముంపు మరో 53,393 ఎకరాలకు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరపగా.. ప్రాజెక్టును పూర్థిస్థాయి సామర్థ్యంతో నిర్మించినా కేవలం 41.67 మీటర్ల ఎత్తులోనే నీటిని స్టోర్ చేసేలా కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా 15,277.84 ఎకరాల మేర భూసేకరణ చేపట్టాల్సి ఉంది. 

ఆ ఎత్తులోనూ నీటిని స్టోర్ చేస్తే మన దగ్గర 6 మండలాల్లోని 954 ఎకరాలు ముంపునకు గురి కానున్నాయి. దాంతోపాటు భద్రాచలం టౌన్, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్లకూ ముంపు ముప్పు పొంచి ఉంది. కిన్నెరసాని, ముర్రేడువాగుతో పాటు మరో ఆరేడు స్థానిక వాగుల్లో డ్రైనేజీ తీవ్రత ఎక్కువ అవుతుందన్న ఆందోళన ఉన్నది. 

దుమ్ముగూడెం ప్రాజెక్టు కింద 36 వాగులు వచ్చి చేరుతుండడంతో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వాటి డ్రైనేజీ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఈ క్రమంలోనే ముంపునకు సంబంధించి కచ్చితంగా సర్వే చేయించి డీమార్కేషన్ చేయించాలని తెలంగాణ పట్టుబడుతున్నది. కానీ, ఏపీ మాత్రం జాయింట్ సర్వేకు అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ వాదనల్లో నిజం లేదని కొట్టిపారేస్తున్నది.