- ఎస్పీకి ఎమ్మెల్యే పాయల్ శంకర్కొడుకు ఫిర్యాదు
ఆదిలాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో తన తల్లిదండ్రులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఉమపై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొడుకు పాయల్ శరత్ కుమార్ ఎస్పీ అఖిల్ మహాజన్ ను కోరారు. మంగళవారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో తమ కుటుంబంపై భూములు, ఆస్తులకు సంబంధించిన నిరాధార ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఒక సోషల్ మీడియా పేజీలో ఎలాంటి అధికారిక విచారణ, న్యాయస్థాన నిర్ధారణ లేకుండానే తప్పుడు కథనాలు ప్రచురించారని, వాటి వల్ల తమ కుటుంబ పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతోందని తెలిపారు. ఈ ప్రచారంపై సైబర్ విభాగం ద్వారా సమగ్ర విచారణ జరిపి, వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
