హైదరాబాద్, వెలుగు: ‘‘నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగిస్తారని, కేంద్రమంత్రి పదవి ఇస్తారని తప్పుడు ప్రచారం జరుగుతున్నది. మా పార్టీలో అలాంటి లీకులు ఎప్పుడూ ఉండవ్’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ‘‘గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిన దాఖలాలు ఉన్నాయా? కేంద్ర మంత్రి పదవి, రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికైనా దక్కినప్పుడు వారి పేర్లు బయటకు వచ్చాయా?” అని ప్రశ్నించారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో సంజయ్ చిట్చాట్ చేశారు. బీజేపీకి ఓటు వేయా లని తెలంగాణ సమాజం డిసైడ్అయిందని ఆయ న అన్నారు. ‘‘బీఆర్ఎస్ను ధైర్యంగా ఎదుర్కోగలిగేది బీజేపీ మాత్రమే. మాకు బీఆర్ఎస్తోనే పోటీ. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడుంది? ఒక్కో నియోజకవర్గంలో మా పార్టీకి ముగ్గురు, నలుగురు అభ్యర్థులు ఉన్నారు. కానీ కాంగ్రెస్కు హుజూరాబాద్ సహా అనేక చోట్ల అభ్యర్థులే లేరు. కేసీఆర్ నిర్మల్కు వెళ్లి కాంగ్రెస్ను విమర్శించారు. కానీ, అక్కడ ఆ పార్టీకి అభ్యర్థే లేడు. కాంగ్రెస్ గ్రాఫ్పెంచడానికే ఆ పార్టీపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరిగిందని సర్వేలో తేలడంతో కేసీఆర్ వణికిపోతున్నారు. అందుకే జాకీలు పెట్టి కాంగ్రెస్ ను లేపుతున్నారు” అని అన్నారు. ‘‘బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనేది తప్పుడు ప్రచారమని ఉప ఎన్నికల్లోనే తేలిపోయింది. బీఆర్ఎస్కు కాంగ్రెస్ఆల్టర్నేట్అయితే ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదో చెప్పాలి. బీఆర్ఎస్పై విమర్శలు చేయొద్దని మాకు ఎవరూ డైరెక్షన్ ఇవ్వలేదు. బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని గతంలో జానారెడ్డి, కోమటి రెడ్డి లాంటి కాంగ్రెస్ నేతలే చెప్పారు” అని సంజయ్ అన్నారు.
అధికారమే మా లక్ష్యం..
రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం సృష్టిం చామని సంజయ్ అన్నారు. ‘‘పార్టీ నిర్మాణమే మాకు ముఖ్యం. నాయకులపై ఆధారపడి బీజేపీ పని చేయదు. వ్యక్తిగా కాకుండా పార్టీ గుర్తుపై అభ్యర్థి గెలవాలన్నదే లక్ష్యం” అని చెప్పారు. ‘‘కర్నాటకలో రాహుల్గాంధీ వల్లనే గెలిచామని కాంగ్రెస్ నేతలే ఒప్పుకోవడం లేదు. గుజరాత్, యూపీ తదితర రాష్ట్రాల్లో రాహుల్ మేనియా ఎందుకు పని చేయలేదో చెప్పాలి” అని డిమాండ్ చేశారు. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కామ్ చార్జ్షీట్లో కవిత పేరు లేకుంటే బీజేపీకి, బీఆర్ఎస్కు సంబంధం ఉన్నట్టా? ఈ కేసులో ఈడీ, సీబీఐ విచారణ జరుగుతోంది. మోడీ ప్రభుత్వ హయాంలో దొంగలెవరూ తప్పించుకోలేరు. ఆలస్యం కావొచ్చు గానీ అవినీతి చేసినోళ్లు జైలుకు పోవడం ఖాయం” అని అన్నారు. ‘‘కేసీఆర్ ముఖం చూడటం రాష్ట్ర ప్రజలకు నచ్చడం లేదు. మా పార్టీ కార్యకర్తల శ్రమ వృథాగా పోదు. అధికారంలోకి రావడమే మా లక్ష్యం” అని చెప్పారు.
అమిత్ షా సభ కోసం కమిటీ
ఖమ్మంలో నిర్వహించనున్న అమిత్షా సభను సక్సెస్ చేసేందుకు మాజీ ఎంపీ గరికపాటి మోహ న్రావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి అమిత్షా సభపై సంజయ్ఆధ్వర్యంలో ముఖ్య నేతలు సమావేశమయ్యారు. సభకు లక్ష మందిని సమీకరించాలని నేతలకు సంజయ్ సూచించారు.
ఖమ్మం సభతో బీజేపీ సత్తా చాటుదాం
లక్ష మందితో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించి రాష్ట్రంలో బీజేపీ సత్తా ఏంటో చాటి చెబుదామని పార్టీ శ్రేణులకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం జిల్లా బూత్ కమిటీ సభ్యులు, జిల్లా నాయకులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వ హించారు. ఈ నెల 15న ఖమ్మంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని సూచించారు. ఖమ్మం జిల్లా బీజేపీ అడ్డా నిరూపించే టైమొచ్చిందని, జిల్లాలో బీజేపీ ఎక్కడుందని దుష్ర్పచారం చేసే వాళ్లకు కనువిప్పు కలిగేలా ఈ సభ ఉండాలన్నారు.
తెలంగాణ మీడియా, రాజకీయ విశ్లేషకులు ఖమ్మం బహిరంగ సభపైనే దృష్టి పెట్టారని సంజయ్ అన్నారు. ఈ సభ సక్సెస్ కాదు, ఎట్లా నిర్వహిస్తారో చూద్దామని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని, కాంగ్రెస్ నేతలు కూడా ఈ సభ ఫెయిల్ కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కార్యకర్తలంతా కలిసి పనిచేసి కేసీఆర్కు, కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలన్నారు. ఈ సభ సక్సెస్తో కేసీఆర్ గుండెల్లో డప్పులు మోగాలన్నారు.