భద్రాద్రి  రామయ్య సన్నిధిలో భక్తుల కోలాహలం

భద్రాద్రి  రామయ్య సన్నిధిలో భక్తుల కోలాహలం

భద్రాచలం, వెలుగు :  భద్రాద్రి రాముని సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. ఉదయం గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం చేశారు. విశేష అలంకరణల తర్వాత బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. ఈ సమయంలో దర్శనాలు నిలిపివేయడంతో క్యూలైన్లలో భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ కారణంగా బేడా మండపంలో జరపాల్సిన నిత్య కల్యాణాన్ని చిత్రకూట మండపానికి మార్చారు.

సీతారామచంద్రస్వామిని ఊరేగింపుగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక వేదికపై కల్యాణం చేశారు. 65 జంటలు కంకణాలు ధరించి క్రతువును నిర్వహించాయి. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక అనంతరం మంత్రపుష్పం సమర్పణతో క్రతువు ముగిసింది. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. భక్తులు పాపికొండల యాత్ర ముగించుకుని రాత్రి సమయంలో తిరిగి రావడంతో ఆలయం కిటకిలాడింది. దర్శనాల కోసం భక్తులు బారులు తీరారు.