- రెండు ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీ
ఘట్కేసర్, వెలుగు: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఘట్కేసర్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్ శ్రీనివాస కాలనీలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రెండు ఇళ్ల తాళాలు పగలగొట్టి నగదు, నగలు ఎత్తుకెళ్లారు. తన బాబాయి అనారోగ్యంతో నిమ్స్ఆసుపత్రిలో చేరడంతో లకావత్ తిరుపతి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఆదివారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో పాటు, బీరువాలోని రెండు తులాల బంగారం, 20 తులాల వెండి పట్టీలు, నగదు మాయమయ్యాయి. అదే సమయంలో పక్కింటి వ్యక్తి వెంకటేష్ ఇంట్లో కూడా ఒక తులం బంగారం దొంగతనానికి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
