
బెజ్జంకి, వెలుగు: మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో దొంగలు హల్ చల్ చేశారు. ఏఎస్ఐ శంకరరావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కేడిక కృష్ణారెడ్డి ఇంట్లో శనివారం రాత్రి దొంగలు చొరబడి బీరువా లాకర్ పగలగొట్టి ఫైనాన్స్ కిస్తీ కట్టాల్సిన రూ.4 లక్షల 10 వేలు, బ్యాగ్ నుంచి మరో రూ. 10వేలు, అరతులం బంగారం, 2 జతల బంగారు కమ్మలు, 13 తులాల వెండి, రెండు జతల పట్టీలు దొంగలించారన్నారు.
మెలకువ వచ్చి లేచిన కృష్ణారెడ్డి దంపతులు అరవగా చుట్టుపక్కల యువకులు వచ్చి దొంగల కోసం వెతికినా వారు దొరకలేదు. సీఐ శీను, క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.