చోరీ చేసిందని మైనర్ బాలికపై థర్డ్​ డిగ్రీ

చోరీ చేసిందని మైనర్ బాలికపై థర్డ్​ డిగ్రీ
  •     పోలీసులు, సఖీ సెంటర్​నిర్వాహకులకు నోటీసులు

నారాయణపేట, వెలుగు: దొంగతనం చేసిందనే ఆరోపణతో ఓ బాలికపై పోలీసులు థర్డ్​ డిగ్రీ ప్రయోగించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మద్దూర్​ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13) టౌన్​లో చోరీ చేసిందనే ఆరోపణతో 50 రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సఖీ సెంటర్​లో ఉంచి విచారిస్తామని చెప్పారు. బాలిక తల్లిని కూడా 4 రోజులు అక్కడే ఉంచారు. చోరీ చేసిన డబ్బులు ఇవ్వాలని అడిగారు. గ్రామ పెద్దలు వచ్చి పోలీసులతో మాట్లాడినా బాలికను విడిచి పెట్టలేదు. దొంగతనం చేసినట్లైతే వెంటనే కోర్టులో ప్రొడ్యూస్​ చేయాల్సి ఉండగా అలా చేయలేదు. పైగా 18 ఏండ్లు పైబడిన వారి సంరక్షణ కోసం పెట్టిన సఖీ సెంటర్​లో 13  ఏండ్ల బాలికను ఉంచారు. ఈ విషయంపై జిల్లా కేంద్రంలోని చైల్డ్​ లైన్​ఆఫీసర్​అశోక్ ​శ్యామల స్పందిస్తూ చోరీ ఆరోపణతో నారాయణపేట పోలీసులు బాలికను సఖీ సెంటర్​లో ఉంచారని, ఇంటరాగేషన్​ టైంలో చిన్నారిపై థర్డ్​ డిగ్రీ ప్రయోగించినట్లు తమ విచారణలో తేలిందన్నా రు. ఇందులో సెంటర్​ నిర్వాహకుల పాత్ర ఉన్నట్లు తెలిసిందన్నారు. ప్రస్తుతం బాలికను వేరే ప్లేస్ లో ఉంచి ప్రొటెక్షన్ ఇస్తున్నామన్నారు. ఎస్సై, సీఐ, సఖీ సెంటర్​ నిర్వాహకులు మొత్తం10 మందికి నోటీసులు అందజేసినట్లు చెప్పారు.