
న్యూఢిల్లీ: గ్రాస్ జీఎస్టీ వసూళ్లు జూన్ నెలలో రూ.1,61,497 కోట్లుగా రికార్డయ్యాయి. కిందటేడాది జూన్లో వచ్చిన జీఎస్టీ రెవెన్యూతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ల (ఇంపోర్ట్స్ మినహాయించి) నుంచి వచ్చిన జీఎస్టీ రెవెన్యూ కిందటేడాది జూన్తో పోలిస్తే 18 శాతం పెరిగింది. అంతేకాకుండా జీఎస్టీ సిస్టమ్ అమల్లోకి వచ్చాక ట్యాక్స్ కలెక్షన్ రూ.1.60 లక్షల కోట్లు దాటడం ఇది నాలుగోసారి మాత్రమే. రూ.1.5 లక్షల కోట్లు దాటడం ఏడోసారి.
వరుసగా 14 వ నెలలోనూ జీఎస్టీ వసూళ్లు రూ.1.4 లక్షల కోట్లు దాటాయి. జూన్ జీఎస్టీ రెవెన్యూలో రూ.31,013 కోట్లు సెంటర్ జీఎస్టీ (సీజీఎస్టీ) కింద, రూ. 38,292 కోట్లు స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) కింద, రూ.80,292 కోట్లు ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) కింద వచ్చాయి. ఐజీఎస్టీలో గూడ్స్ దిగుమతుల నుంచి సేకరించిన రూ.39,035 కోట్లు కలిసి ఉన్నాయి. సెస్ కింద మరో రూ.11,900 కోట్లు వసూలవ్వగా, ఇందులో గూడ్స్ దిగుమతుల నుంచి సేకరించిన రూ.1,028 కోట్లు కలిసి ఉన్నాయి. ఐజీఎస్టీ నుంచి వచ్చిన రెవెన్యూలో రూ.36,224 కోట్లను సీజీఎస్టీ కింద, రూ.30,269 కోట్లు ఎస్జీఎస్టీ కింద ప్రభుత్వం సెటిల్ చేసింది.
తెలంగాణలో రూ. 4,681.39 కోట్లు..
కిందటి నెలలో తెలంగాణలో జీఎస్టీ కింద రూ. 4,681.39 కోట్లు వసూళ్లయ్యాయి. కిందటేడాది జూన్లో రికార్డయిన రూ.3,901.45 కోట్లతో పోలిస్తే ఇది 20 శాతం గ్రోత్కు సమానం. దేశం మొత్తం మీద ఐజీఎస్టీ కింద రూ. 80,292 కోట్లు వసూళ్లయితే, సెటిల్మెంట్ కింద రూ.1,621.37 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అందాయి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కిందటి నెలలో రూ.3,477.42 కోట్లు వచ్చాయి. 16 శాతం గ్రోత్ నమోదు చేశాయి.