- నిల్వ చేసేందుకు గిడ్డంగులకు అనుమతులు ఇచ్చాం
- హమాలీ, లారీల కొరతను అధిగమిస్తాం
- రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి
కూసుమంచి, వెలుగు: రాష్ట్రంలో ఈ ఏడాది మక్కాల దిగుబడి ఎక్కువగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి తెలిపారు. గురువారం కూసుమంచి మండలం జీళ్లచెరువులోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మక్క రైతులకు ఎకరానికి 35 నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందన్నారు. గత ఐదేళ్లుగా మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదని, ఈ ఏడాది వాటిని ప్రారంభించినట్లు తెలిపారు. మక్కల నిల్వ కోసం అన్ని వేర్హౌస్లకు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు.
హమాలీలకు చెల్లించే చార్జీలను రూ.6 నుంచి రూ.8 వరకు పెంచామని, కొంతమేర హమాలీల కొరత ఉందన్నారు. అవసరమైన లారీలను సమీకరించి మక్కలను రవాణా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం 1.27 లక్షల బస్తాల మక్కలు రవాణాకు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే గిడ్డంగులకు తరలిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ సతీశ్, ఏవో వాణి, సీఈవో రామకృష్ణ, ఏఈవోలు రవీందర్, జానీబాబా, రవికుమార్ పాల్గొన్నారు.
