అమ్మవారికి బోనాలు పెట్టకుండా .. అడ్డుకుని దాడి చేసిన్రు

అమ్మవారికి బోనాలు పెట్టకుండా .. అడ్డుకుని దాడి చేసిన్రు
  • గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన వట్టినాగులపల్లి దళితులు 

గచ్చిబౌలి, వెలుగు : బొడ్రాయి పండుగ ఉత్సవాల్లో బోనాలు పెట్టనీయకుండా తమను ఇతర కులాల వారు అడ్డుకున్నారంటూ వట్టినాగువల్లి గ్రామ దళితులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. గ్రామంలో గ్రామ దేవత, బొడ్రాయి పండుగను బుధవారం నిర్వహించారు. ముందుగా గ్రామానికి చెందిన కొందరు దళితులు బొడ్రాయికి బోనాలు సమర్పించేందుకు వెళ్లారు. ఇతర కులాలకు చెందిన వారు దళితులను అడ్డుకున్నారు.

బోనాలు సమర్పించవద్దని, తమను తిడుతూ దాడికి పాల్పడ్డారని దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోనాలు సమర్పించనీయకుండా మహిళలను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ జేమ్స్ బాబు తెలిపారు.