రిజర్వేషన్లతో ఎదిగిన వారు మరో పది మందిని పైకి తీసుకురావాలి: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రిజర్వేషన్లతో ఎదిగిన వారు మరో పది మందిని పైకి తీసుకురావాలి: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

డా.అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లతో ఎదిగిన వారు ఒక్కొక్కరు మరో పది మందిని పైకి తీసుకురావాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రేణిగుంటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని చదువుకోవాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే వివేక్. 

చదువు కుంటే ధైర్యం వస్తుందని, ప్రశ్నించే తత్వం ఉంటుందని, ఆర్థికంగా ఎదగాలంటే చదువు ఒక్కటే మార్గమని ఈ సదర్భంగా ఎమ్మెల్యే వివేక్ అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ పేదరికాన్ని జయించి, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి ఎంతో మందికి రోల్ మోడల్ గా అంబేద్కర్ నిలిచారని కొనియాడారు. 

గ్రామ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఉంటే ఆయన లాగే చదువుకుని ఎదగాలనే అవగాహన యువతలో వస్తుందని అందుకే ఎవరైనా విగ్రహం అడిగితే తప్పకుండా డొనేట్ చేస్తున్నట్లు చెప్పారు. తన తండ్రి కాకా వెంకటస్వామి.. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకోసం కృషి చేయాలని చెప్పారన్నారు. అందుకే అంబేద్కర్ విగ్రహాలు ఇప్పటికి సుమారు 120 కి పైగా ఆవిష్కరణ చేశామని చెప్పారు.  ప్రతి అంబేద్కర్ విగ్రహానికి 50 వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు.  తన తండ్రి చదువుకోక పోయినా అంబేద్కర్ నుంచి స్ఫూర్తి పొంది విద్యాసంస్థలు స్థాపించారని గుర్తు చేశారు. 

 రజాకార్లను తరిమిన గడ్డ ఈ తెలంగాణ లో రేణికుంట పోరాటాల గడ్డ అని.. అలాంటి ఈ గ్రామంలో అందరూ చదువుకుని ఎదగాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఒక్క రోల్ మోడల్ అని.. ఆయన ఆశయలను సాధించడం కోసం అందరం కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు.   

అంబేద్కర్ అంటే కేవలం రిజర్వేషన్లే కాదని అందరికీ హక్కులు ప్రసాదిస్తూ రాజ్యాంగాన్ని రాశారని అన్నారు. మహిళలకు సమాన హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లు తెచ్చారని తెలిపారు. 8 గంటల పని, కనీస వేతన చట్టాలు అంబేద్కర్ కృషి వల్లనే వచ్చాయని తెలిపారు. 

 అంబేద్కర్ రాసిన రాజ్యాంగం  వల్లనే ఎమ్మెల్యే అయ్యాను :  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

 అంబేద్కర్ రాసిన రాజ్యాంగం  వల్లనే తను ఎమ్మెల్యే అయినట్లు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  అన్నారు.  గ్రామ నడిబొడ్డున ప్రతి ఊరి లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని పిలుపనిచ్చారు. ప్రపంచంలో దేవుడు, మహనీయుడు అంబేద్కర్ అన కొనియాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు.