టోర్నీ రద్దవడంతో రానున్న ఇన్సూరెన్స్ సొమ్ము
మరి ఐపీఎల్ పరిస్థితి?
కరోనా వైరస్ విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. టెన్నిస్ విషయానికొస్తే.. ప్రతిష్టాత్మక వింబుల్డన్ ను నిర్వాహకులు ఏకంగా రద్దు చేశారు. అయితే ఈ టోర్నీని రద్దు చేసినా.. నిర్వాహకులకు మాత్రం భారీగా నష్టం వాటిల్లడం లేదు. వింబుల్డన్కు ఇన్సూరెన్స్ ఉండటంతో.. దాదాపు 114 మిలియన్ పౌండ్ల (దాదాపు 1,080 కోట్లు) బీమా సొమ్ము ఆల్ ఇంగ్లండ్ క్లబ్ లకు అందనుంది. ఒకవేళ షెడ్యూల్ ప్రకారం టోర్నీ జరిగినట్లయితే 250 మిలియన్ పౌండ్ల ఆదాయం వచ్చేది. విదేశాల్లో ప్రతిదానికి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి నిర్వాహకులు తక్కువ నష్టంతో బయటపడుతుంటారు. మరి అదే ఐపీఎల్ విషయానికొస్తే.. ఈ సీజన్లో లీగ్ జరగకపోతే భారీ మొత్తంలో నష్టపోతామని అటు బీసీసీఐ, ఇటు బ్రాడ్కాస్టర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే ఐపీఎల్ కోసం వైరస్ రిలేటెడ్ క్లాజ్ ఉన్న ఇన్సూరెన్స్ ను తీసుకోవడానికి బీసీసీఐ ఎందుకు ఆలోచించడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ విషయంపై బోర్డు అధికారి ఒకరు స్పందించారు. ప్రదేశాలు మారే కొద్ది పాలసీలో చాలా మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. ‘వింబుల్డన్తో పోల్చాల్సి వచ్చినప్పుడు.. ఐపీఎల్కు సంబంధించిన మార్కెట్, సాధ్యాసాధ్యాలను కూడా ఇక్కడ పరి గణనలోకి తీసుకోవాలి. ఇలాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఇండియన్ మార్కెట్ లో క్యాన్సలేషన్ క్లాజ్ ఎంతవరకు ఉపయోగపడుతుందనేది కూడా పరిశీలించాలి. యూకేలో ఇన్సూరెన్స్ సెక్టార్ చాలా డెవలప్ అయ్యింది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఒకవేళ వింబుల్డన్ మోడల్ ఇన్సూరెన్స్ను తీసుకోవాలంటే ఇక్కడ బ్యాక్ డ్రాప్ కూడా పెద్దగా ఉండాలి. కాబట్టి దీనిపై పూర్తి స్టడీ చేయాల్సి ఉంది’ అని వివరించారు.