- మొత్తం 3,587 మంది అర్హులు.. రావాల్సింది రూ. 21.39 కోట్లు
- ఇప్పటి వరకు కేవలం 1,310 మందికి రూ. 7.98 కోట్లు చెల్లింపు
- ఇంకా 2,277 మందికి రూ. 13.41 కోట్లు పెండింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ తర్వాత అందాల్సిన ఆర్థిక భరోసా అటకెక్కింది. సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ (పదవీ విరమణ ప్రయోజనాలు) కింద రావాల్సిన నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతుండటంతో వేలాది మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాల పాటు సేవలు అందించి విశ్రాంత జీవనం గడుపుతున్న వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన నామమాత్రపు ప్రయోజనాలు కూడా సకాలంలో అందకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు (ఏడబ్ల్యూటీ), హెల్పర్లు (ఏడబ్ల్యూహెచ్) కలిపి మొత్తం 3,587 మంది ఈ సర్వీస్ ఎండ్ ప్రయోజనాలకు అర్హులుగా తేలినప్పటికీ, నిధుల విడుదలలో మాత్రం ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. వీరికి మొత్తం రూ. 21.39 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉండగా, అందులో సగం కూడా విడుదల కాలేదు.
పెరిగిన ప్రయోజనాలు అందట్లేదు
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ గతేడాది కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ను రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలకు, హెల్పర్ల బెనిఫిట్స్ను రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచింది. సాధారణంగా అంగన్వాడీల పదవీ విరమణ వయసు 65 ఏళ్లు ఉండగా, 60 ఏళ్లు దాటిన వారు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నా ఈ బెనిఫిట్స్ వర్తింపజేస్తామని ప్రకటించింది.
ఈ నిర్ణయంతో వేలాది మందికి మేలు జరుగుతుందని భావించినా, నిధుల చెల్లింపు ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. పెంచిన ప్రయోజనం కాగితాలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో బిల్లులు క్లియర్ కావడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేలల్లో లబ్ధిదారులు.. వందల్లోనే చెల్లింపులు
రాష్ట్రంలో సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ కోసం అర్హులైన 3,587 మంది లబ్ధిదారుల్లో 740 మంది టీచర్లు ఉండగా, 2,847 మంది హెల్పర్లు ఉన్నారు. వీరందరికీ రూ. 21.39 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 1,310 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. ఇందులో 287 మంది టీచర్లు, 1,023 మంది హెల్పర్లు ఉండగా.. వీరికి రూ. 7.98 కోట్లు చెల్లించారు.
పెండింగ్లో రూ. 13.41 కోట్ల బిల్లులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,277 మంది లబ్ధిదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వీరికి సంబంధించి సుమారు రూ. 13.41 కోట్ల బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ బకాయిల జాబితాలో 453 మంది టీచర్లు, 1,824 మంది హెల్పర్లు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
అధికారులు రికార్డుల్లో అర్హులను గుర్తించినా, ట్రెజరీల నుంచి నిధులు విడుదల కాకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని, తమకు రావాల్సిన సర్వీస్ ఎండ్ సొమ్మును వెంటనే ఖాతాల్లో జమ చేయాలని అంగన్వాడీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
