లక్సెట్టిపేట, వెలుగు: నకిలీ నోట్లను చలామణి చేయడానికి వచ్చిన ముగ్గురిని బుధవారం అరెస్టు చేసి వారి నుంచి రూ. లక్షా 61 వేల ఫేక్ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ తెలిపారు. లక్సెట్టిపేట పోలీస్ స్టేషన్లో బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు.
ఇటీవల దొంగ నోట్ల కేసులో 12 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా.. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇటిక్యాల గ్రామ సమీపంలో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.
కాకినాడకు చెందిన కోదండరావు, పశ్చిమగోదావరి జిల్లా చింతపల్లి మండలానికి చెందిన రవి, గోదావరి ఖని కి చెందిన శ్రీనివాస్ గా వారిని పోలీసులు గుర్తించారు. ఇంతకు ముందు అరెస్ట్ అయిన 12 మందికి ఫేక్నోట్లు ఇచ్చేది వీరే అని పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో మళ్లీ నకిలీ నోట్ల ఇచ్చేందుకు రాగా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పట్టుకున్న లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై సురేష్, పోలీస్ సిబ్బందిని ఏసీపీ ప్రకాశ్అభినందించారు.
