తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిన ముగ్గురు చిన్నారులు తప్పిపోగా, వారిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. స్టేషన్ ఘన్పూర్ కు చెందిన ఒక కుటుంబం శుక్రవారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో దీక్షిత, సేతన్, బేక్షిత్ అనే ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రుల నుంచి విడిపోయారు.
పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో మేడారం పోలీస్ స్టేషన్కు చేరుకొని ఎస్సై కమలాకర్ ను ఆశ్రయించారు. వెంటనే ఎస్సై సిబ్బందితో కలిసి జాతర పరిసరాల్లో గాలించారు. మైక్ అనౌన్స్మెంట్ ఇప్పిస్తూ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు.
జంపన్న వాగు వద్ద ఏడుస్తూ కనిపించిన ముగ్గురు చిన్నారులను గుర్తించి చాక్లెట్లు ఇచ్చి స్టేషన్ కు తీసుకువచ్చారు. తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించారు. పిల్లలు క్షేమంగా దొరకడంతో తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.
