
తెలంగాణలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుందని తెలిపింది.
మంగళవారం తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ విషయానికి వస్తే... దక్షిణ చత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణా మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఉందని వెల్లడించింది. మంగళవారం ఇది బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని కారణంగా మూడు రోజుల పాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.