హైదరాబాద్ లోని అంబర్ పేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏమైందో ఏమో తెల్వదు ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కూతురితో పాటు దంపతులిద్దరు ఇంట్లో ఉరేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
బాగ్ అంబర్ పేటలోని మల్లికార్జున్ నగర్ లో నివాసం ఉంటున్న దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మి, కూతురు శ్రావ్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి వచ్చిన అంబర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి.? ఏమైనా వివాదాలు ఉన్నాయా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు పోలీసులు.
కొన్ని రోజుల క్రితమే రాంనగర్ లో పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకుంది. దీంతో రామ్ నగర్ లో ఉంటున్న ఫ్యామిలీ అంబర్ పేటలోని రామకృష్ణ నగర్ కు మకాం మార్చి అద్దెకు ఉంటున్నారు. దేవుడు పిలుస్తున్నాడని.. తాము కూడా పెద్ద కూతురు దగ్గరికే వెళ్తామని అనేవారని స్థానికులు చెబుతున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి మూఢనమ్మకాలే కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
పురుగుల మందు తాగిన దంపతులు
నవంబర్ 21న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నాగోల్ తట్టియన్నారం శివారులో పురుగుల మందు తాగి దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కొత్తపేటకు చెందిన భార్యా భర్తలు మల్లేష్(45) ,సంతోషి(37) గుర్తించారు పోలీసులు. ఆర్థిక సమస్యలు, వివాదాలు కుటుంబాలను చిదిమేస్తున్నాయి.
