కేక్ కట్ చేసిన కాసేపటికే.. ముగ్గురు మృతి

కేక్ కట్ చేసిన కాసేపటికే.. ముగ్గురు మృతి

అప్పటిదాకా కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆ ముగ్గురి ఆనందం ఎంతసేపో నిలవలేదు. కొత్త సంవత్సరం ఎంతోమందికి ఎన్నో ఆశలతో ఆహ్వానం పలికితే, వీరికి మాత్రం చావుతో ఆహ్వానం పలికింది. కేక్ కట్ చేసిన తర్వాత.. సముద్ర స్నానానికి దిగి, అలల ధాటికి మునిగి ముగ్గురు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం సముద్రంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు తిరుపతి జీవకోనకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. నూతన సంవత్సరం సందర్భంగా సముద్రం వద్ద కేక్ కట్ చేసి, ఆ తర్వాత సముద్ర స్నానానికి వెళ్లారు. సముద్రంలో ఒక్కసారిగా అలలు ఎగిసిపడటంతో వారంతా అలల ధాటికి సముద్రంలో మునిగి చనిపోయారు. మృతదేహాల్ని నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.