బిర్యాని తిని ముగ్గురికి అస్వస్థత ..ఒకరి పరిస్థితి విషమం..భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఘటన

బిర్యాని తిని ముగ్గురికి అస్వస్థత ..ఒకరి పరిస్థితి విషమం..భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఘటన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బిర్యాని తిని ముగ్గురు అస్వస్థతకు గురవగా.. వీరిలో ఒకరికి సీరియస్ గా ఉన్న ఘటన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం టౌన్ లో జరిగింది. బాధితులు రెస్టారెంట్​వద్ద ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలను బాధితులు బుధవారం మీడియాకు తెలిపారు. పాల్వంచకు చెందిన షానవాజ్, గణేశ్, రోహిత్​ కొత్తగూడెం టౌన్ లోని రైస్​గ్రాండ్​ రెస్టారెంట్ లో మంగళవారం వెళ్లారు. వీరు బిర్యాని తింటుండగా.. మాంసం వాసన రావడంతో రెస్టారెంట్​సిబ్బందిని నిలదీశారు. తప్పైందని,  బిల్లు కట్టాల్సిన అవసరం లేదంటూ యువకులకు సర్ది చెప్పేందుకు యత్నించారు. అయినా.. వినకుండా యువకులు బిల్లు కట్టి రశీదు తీసుకుని వెళ్లారు. 

కొద్దిసేపటికి వాంతులు చేసుకోగా..  కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. టెస్టులు చేసిన డాక్టర్లు ఫుడ్ ​పాయిజన్​అయిందని తేల్చారు. వెంటనే యువకులు ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు కంప్లయింట్ చేశారు. షానవాజ్  కు సీరియస్ గా ఉండడంతో బుధవారం రెస్టారెంట్ వద్దకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. “ మమ్ముల్ని ఎవరూ ఏమి చేయలేరు. మీరు ఎవరికి చెప్పుకుంటారో, చెప్పుకోండి” అంటూ రెస్టారెంట్​యాజమాన్యం బెదిరించిందని బాధితులు వాపోయారు. గతంలోనూ రెస్టారెంట్ లో పలుమార్లు పాడైన మాంసం పెడ్తున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. వెంటనే అధికారులు స్పందించి రెస్టారెంట్​ను సీజ్​చేయాలంటూ బాధితులతో పాటు స్థానికులు డిమాండ్​చేస్తున్నారు.