తోటి మిత్రులే తాగిన మైకంలో మరో మిత్రుడిని హత్య చేశారు. హత్య చేసిన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. శవాన్ని సమీప వాగులో పడేసి, నేరాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. ఈ దారుణ ఘటన ఈ నెల 6న పటాన్ చెరు పీఎస్ పరిధిలో జరిగింది.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు కు చెందిన అరుణ్ గౌడ్, ముత్తంగి కి చెందిన మధుసుధన్ రెడ్డి, శివా రెడ్డి, శ్రీపాల్ లు స్నేహితులు. వీరంతా ఓ కారు షెడ్డు నిర్వాహకులు. వీరి మధ్య గత కొద్ది కాలంగా వ్యాపార లావాదేవీల్లో తేడాలతో అనునిత్యం మద్యం సేవించినప్పుడల్లా గొడవలు జరుగుతున్నాయి.
వ్యాపార లావాదేవీల విషయంలో అరుణ్ గౌడ్ తో మిగతా ముగ్గురు గొడవ పడేవారు. ఈ క్రమంలో విసుగు చెందిన మధుసూదన్ రెడ్డి పథకం ప్రకారం.. అరుణ్ గౌడ్ ను తమ కార్ షెడ్ వద్ద ఉన్న తాడుతో ఉరి బిగించి చంపేశాడు. తన తోటి మిత్రులు శివ రెడ్డి, శ్రీపాల్ ల సాయంతో మృతదేహాన్ని సమీపంలోని ముత్తంగి ORR జంక్షన్ పక్కన నక్కవాగులో పడెసారు.
ఆ మరుసటి ఉదయం మృతదేహాన్ని చూసిన పోలీసులు తొలుత ఆక్సిడెంట్ కేస్ గా నమోదు చేసుకున్నారు. పోస్ట్ మార్టంలో గొంతుకు తాడు బిగించిన మార్కుతో పోలీసులు హత్యగా నిర్దారించి విచారణ జరిపారు. ముగ్గురు మిత్రులు కలిసి హత్య చేశారని తేలడంతో వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని మీడియా సమావేశంలో స్థానిక DSP రాజేశ్వర్ రావు తెలిపారు.