- ఎన్నికల్లో గందరగోళానికి గురవుతున్న ప్రజలు
న్యూఢిల్లీ: ఈ సారి గుజరాత్లోని భరూచ్ లోక్సభ స్థానంలో ఆసక్తికర పోరు జరగనుంది. అక్కడ ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), భారత్ ఆదివాసీ పార్టీ(బీఏపీ) నుంచి ‘వసావా’ అనే ఒకే ఇంటి పేరు గల ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్ సుఖ్ వసావా మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
అలాగే, ఆప్ నుంచి చైతర్ వసావా బరిలోకి దిగుతున్నారు. ఆయన ప్రస్తుతం భరూచ్ పార్లమెంట్ పరిధిలోని దేడియాపాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరితో పాటు భారత్ ఆదివాసీ పార్టీ నుంచి దిలీప్ వసావా పోటీ చేస్తున్నారు. దిలీప్ వసావా.. సీనియర్ గిరిజన నాయకుడు, ఝగాడియా స్థానం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చోటూ వసావా చిన్న కొడుకు.
దీంతో ఈ స్థానంలో పోటీ ‘వసావా వర్సెస్ వసావావర్సెస్ వసావా’గా మారింది. ఆరు లక్షలకుపైగా గిరిజన ఓటర్లు ఉన్న భరూచ్ స్థానంలో మూడో దశలో మే 7న పోలింగ్జరగనుంది. ఈ స్థానంలో పార్టీల కంటే కుటుంబ, వారసత్వ రాజకీయాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. దశాబ్ద కాలంగా అక్కడి రాజకీయాలను వసావా వంశం శాసిస్తోంది. దీంతో ఈ సారి కూడా బీజేపీ, ఆప్, బీఏపీ తిరిగి అదే వంశానికి చెందిన అభ్యర్థులను నామినేట్ చేయడంతో అక్కడ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అయితే, ఈ వంశానికి చెందిన వారు ఎన్నికల బరిలో నిలవడం ఇదే మొదటిసారి కాదు.
గతంలో కూడా వీరు పలు ఎలక్షన్స్లో తలపడ్డారు. దీంతో ప్రతిసారీ ఓటర్లు కొంత గందరగోళానికి గురవుతున్నారు. కాగా, 1989 నుంచి 2019 వరకు ఈ స్థానంలో జరిగిన ప్రతి లోక్సభ ఎన్నికలో, ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. 1998 నుంచి బీజేపీకి చెందిన మన్సుఖ్ వసావా ఈ సీటును గెలుస్తూ వస్తున్నారు. అయితే, ఈ సారి చోటూ వసావా కొడుకు ఎంట్రీ ఇవ్వడంతో మన్ సుఖ్ కు కొంత ఇబ్బందిగా మారనుందని తెలుస్తోంది.