వరంగల్ / మహబూబ్నగర్ /నాగర్కర్నూల్, వెలుగు: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. వరంగల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మహబూబ్నగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డికి రెండో సారి అవకాశం దక్కనుంది. వీరి ఎన్నికను శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు. కొందరు ఇండిపెండెంట్లు తమ నామినేషన్లను తిరస్కరించడంపై ఆందోళనలకు దిగారు. అధికారులు అడిగినట్లే పత్రాలు సమర్పించినా.. రిజక్ట్ చేయడం ఏమిటని మండిపడ్డారు. వరంగల్ సీటులో స్కూటిని అనంతరం మొత్తం నలుగురు క్యాండిడేట్లు బరిలో నిలవగా.. విత్డ్రాల మొదటి రోజైన గురువారం ముగ్గురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వాపస్ తీసుకున్నారు. దీంతో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవం కానున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ సీట్లకు స్ర్కూటిని తర్వాత నలుగురు పోటీలో నిలవగా.. ఇందులో ఇద్దరు ఇండిపెండెంట్లు గురువారం నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవం కానున్నారు.
ఏకగ్రీవాలకు ముందు నుంచే ప్లాన్
ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడానికి ముందు నుంచే టీఆర్ఎస్ ప్లాన్ వేసింది. పార్టీ క్యాండిడేట్లను ఫైనల్ చేసినప్పటి నుంచి ఇతరులు ఎవరూ పోటీలో లేకుండా జిల్లా స్థాయి నాయకులు చక్రం తిప్పారు. మహబూబ్నగర్లోని రెండు సీట్లకు మొత్తం పది మంది నామినేషన్లు వేయగా.. ఆరుగురు ఇండిపెండెంట్ల నామినేషన్లను వివిధ కారణాలతో స్ర్కూటినిలో ఆఫీసర్లు తొలగించారు. మిగిలిన ఇద్దరు ఇండిపెండెంట్లను కూడా పోటీ నుంచి తప్పించేందుకు బుధవారం మధ్యాహ్నం నుంచే టీఆర్ఎస్ లీడర్లు చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇందు కోసం భారీ మొత్తంలో ఆఫర్ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరికి ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిని గురువారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో అభినందించారు.
నామినేషన్ల తిరస్కరణపై ఇండిపెండెంట్ల ఆగ్రహం
తమ నామినేషన్లను తిరస్కరించడంపై ఇండిపెండెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, టీఆర్ఎస్ లీడర్లపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. తన నామినేషన్ రిజెక్ట్ చేయడంపై అనుమానాలు ఉన్నాయని, కోర్టును ఆశ్రయిస్తానని గద్వాల జిల్లా గట్టు ఎంపీటీసీ ఎస్.కృష్ణ చెప్పారు. సింగిల్ సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చారన్న కారణంతో రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ను రిజెక్ట్ చేశారు. దీంతో కృష్ణ గురువారం ఎన్నికల కమిషన్లో ఫిర్యాదు చేశారు. తనకు ఫోన్లు చేసి హెచ్చరించారని, దేనికీ భయపడేది లేదని ఆయన అన్నారు. స్ర్కూటిని టైంలో నామినేషన్ సెట్స్ చెక్ చేసుకోవడానికి రెండు గంటల టైం ఇస్తామని చెప్పిన అధికారులు మాట మార్చి ఏకపక్షంగా తన నామినేషన్ రిజెక్ట్ చేశారని జడ్చర్ల కౌన్సిలర్షేక్ రహీం బాషా ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు ఇండిపెండెంట్లను నామినేషన్లు విత్డ్రా చేసుకునేలా భయపెట్టారని కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జనుంపల్లి అనిరుధ్రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్ర్కూటినిలో ఆరుగురు ఇండిపెండెంట్ల నామినేషన్లు ఎందుకు రిజెక్ట్ చేశారని ఆర్వోను ప్రశ్నించారు. టీఆర్ఎస్ లీడర్ల ఒత్తిడి వల్ల వాటిని తిరస్కరించారని ఆరోపించారు.