- రాజేంద్రనగర్లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఘటన
- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్టేషన్లో బాధితురాలి ఫిర్యాదు
- వాట్సాప్లో అసభ్యకర మెసేజ్లు పెడుతున్నడు
- బలవంతంగా ఫోన్ అన్లాక్ చేయించి.. గొంతుపై కత్తి పెట్టాడని కంప్లయింట్.. కేసు నమోదు
హైదరాబాద్/ గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కలకలం రేగింది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగిక వేధిస్తున్నాడంటూ కర్నాటకకు చెందిన ట్రైనీ మహిళా ఐపీఎస్ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మట్లాడటంతోపాటు గొంతుపై కత్తి పెట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
కర్నాటక హల్లి మైసూర్ ప్రాంతానికి చెందిన బాధితురాలు.. జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్గా శిక్షణ పొందుతున్నారు. శిక్షణలో ఉండగా ఆమెకు వివాహం జరిగింది. అయితే ఆమెతోపాటు శిక్షణలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్టారెడ్డి వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వాట్సాప్కు అసభ్యకర సందేశాలు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని, తన గౌరవానికి భంగం కలిగించేలా ఇతరులకు తెలుగులో కామెంట్లు చేస్తున్నాడని తెలిపారు.
అకాడమీలో శిక్షణ పొందుతున్న వ్యక్తితో చనువుగా ఉంటున్నానని నిందలు వేస్తూ ప్రచారం చేస్తున్నాడని, ఈ ప్రచారం నిజమని చెప్పి ఒప్పుకోవాలని అందరి ముందు బలవంతం చేస్తున్నాడని వాపోయారు. అందరి ముందు అసభ్యకరమైన బూతులు తిట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్రైనీ ఐపీఎస్తో ఉన్న సంబంధం ఒప్పుకోవాలని బలవంతం చేయడంతోపాటు ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపాలని ఒత్తిడి తెచ్చేవాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపారు.
కండోమ్ ప్యాకెట్లు విసిరేసి.. గొంతుపై కత్తి పెట్టి..
ఈ నెల 8న ఫోన్ లాక్కున్న ఉదయ్.. దాన్ని అన్లాక్ చేయాలంటూ ఒత్తిడి చేశాడని, 9న రాత్రి 9 గంటల సమయంలో తనను జుట్టుపట్టుకొని అతడి రూమ్కు ఈడ్చుకువెళ్లాడని, గొంతుపై కత్తి పెట్టి కదలకుండా చేశాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. తనపై కండోమ్ ప్యాకెట్లు విసిరివేడయంతోపాటు గొంతు నులిమి చంపే యత్నం చేశాడని, అసభ్యకరంగా తాకాడని తెలిపారు.
ఈ నెల 10న తనపై దాడి చేసిన ఉదయ్.. తనకు తెలియకుండా తీసిన వీడియోను తన భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేశాడని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి తన పరువుకు భంగం కలిగించాడని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
