తగ్గుముఖం పడుతున్న వరద ఉధృతి..
నల్గొండ: నాగార్జునసాగర్ డ్యామ్ కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 6 గేట్ల ద్వారా 1 లక్షా 29 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కేంద్ర జలవనరుల శాఖ అంచనాల ప్రకారం కృఫ్ణా నదిలోవరద పోటు తగ్గే అవకాశం ఉండడంతో గేట్ల ద్వారా నీటి విడుదలను క్రమంగా తగ్గిస్తున్నారు. శ్రీశైలం వద్ద గేట్ల ద్వారా నీటి విడుదల నిలిచిపోయే వరకు ఇక్కడ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగేఅవకాశం ఉంది. ఎగువన మహారాష్ట్ర, కర్నాటక, ఏపీల మీదుగా ఇప్పటికే వరద పోటు తగ్గినా ఉధృతి కొనసాగుతోంది. కృష్ణా నదిపై ఉన్న అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోవడంతో వస్తున్న వరద ప్రవాహాన్ని నిల్వ చేసే అవకాశం లేక వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ వద్ద 8 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేసిన అధికారులు కొద్ది సేపటి క్రితం రెండు గేట్లు మూసేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1 లక్ష 45 వేల 468 క్యూసెక్కులు.. వస్తుండగా.. 6 గేట్ల ద్వారా… 1 లక్ష 28 వేల 909 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.. కాగా ప్రస్తుతం 305.6242 టీఎంసీల నిల్వ ఉంచుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.. కాగా ప్రస్తుత నీటిమట్టం 587.20 అడుగులు ఉంది.