లక్నో: ఉత్తరాఖండ్తో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్నాటక భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆదివారం మొదలైన ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ (141), దేవదత్ పడిక్కల్ (148 బ్యాటింగ్) సెంచరీలతో దంచికొట్టడంతో.. తొలి రోజు ఆట ముగిసే టైమ్కు కర్నాటక తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 355/2 స్కోరు చేసింది. పడిక్కల్తో పాటు కరుణ్ నాయర్ (37 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
మయాంక్ అగర్వాల్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... రాహుల్, పడిక్కల్.. ఉత్తరాఖండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపెట్టారు ఈ క్రమంలో రాహుల్ 153, పడిక్కల్ 144 బాల్స్లో సెంచరీలు అందుకున్నారు. రెండో వికెట్కు 278 రన్స్ జోడించి రాహుల్ వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ నెమ్మదిగా ఆడుతూ వికెట్ను కాపాడుకున్నాడు. పడిక్కల్తో మూడో వికెట్కు 59 రన్స్ జత చేసి క్రీజులో కొనసాగుతున్నాడు. ఆదిత్య రావత్ రెండు వికెట్లు తీశాడు.
సుదీప్ సెంచరీ.. బెంగాల్ 249/5
కళ్యాణి: జమ్మూ కశ్మీర్తో మొదలైన మరో సెమీస్లో బెంగాల్ తడబడి కోలుకుంది. సుదీప్ కుమార్ ఘరామీ (136 బ్యాటింగ్) సెంచరీ సాధించడంతో.. ఆదివారం తొలి రోజు ఆట ముగిసే టైమ్కు బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 79.5 ఓవర్లలో 249/5 స్కోరు చేసింది. టాస్ ఓడిన బెంగాల్ను ఆరంభంలో జమ్మూ కశ్మీర్ బౌలర్లు ఇబ్బందిపెట్టారు. ఇన్నింగ్స్ ఎనిమిదో బాల్కే సుదీప్ చటర్జీ (0)ని డకౌట్ చేశారు.
అభిమన్యు ఈశ్వరన్ (49)తో కలిసి సుదీప్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. రెండో వికెట్కు 85 రన్స్ జోడించి అభిమన్యు వెనుదిరగగా, రెండు ఓవర్ల తర్వాత సూరజ్ సింధు జైస్వాల్ (0) వికెట్ ఇచ్చుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అనుస్తుప్ మజుందార్ (14) కూడా ఔటవ్వడంతో బెంగాల్ ఇన్నింగ్స్ తడబడింది. ఈ దశలో షాబాజ్ అహ్మద్ (42)తో కలిసి సుదీప్ ఇన్నింగ్స్లో నిలకడ తెచ్చాడు. అకిబ్ నబీ, సునీల్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
