వనపర్తి, వెలుగు : ప్రణాళిక బద్ధంగా పనిచేసి వనపర్తి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్ల పదవీ బాధ్యత స్వీకరణ కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ గా మిడిదొడ్డి మాధవి, వైస్ చైర్పర్సన్ గా మధుసూదన్ గౌడ్ తో పాటు కాంగ్రెస్పార్టీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. చైర్ పర్సన్ మాధవి ఉద్యోగులకు అందించే అలవెన్స్ ఫైల్ పై, తాగునీటి సమస్యల పరిష్కారం ఫైల్ పై మొదటి సంతకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు వారానికో వార్డులో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకుంటారని, నెలకోసారి మీటింగ్ పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. అనంతరం వనపర్తి మండలం చందాపూరులో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న పుల్లరి నీలమ్మ నాగరాజు గృహప్రవేశానికి ఎమ్మెల్యే హాజరై దంపతులకు నూతన వస్త్రాలను అందించి అభినందనలు తెలిపారు.
