
నిర్వహణా బాధ్యత తీసుకున్నటై హైదరాబాద్
తొలిసారి వర్చ్యువల్ వేదికగా అతిపెద్ద ఈవెంట్
వెలుగు, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద, తొలి వర్చ్యువల్ టై గ్లోబల్ సమ్మిట్ 2020ను ‘టై హైదరాబాద్’ నిర్వహించబోతుంది. ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి 10 తేదీల్లో ఈ సమిట్ జరుగుతుందని టై హైదరాబాద్ సభ్యులు చెప్పారు. ఈ సమిట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించే అవకాశం ఉంది. టై గ్లోబల్ సమిట్లో 25 దేశాల నుంచి 20 వేల మంది ఎంట్రప్రెన్యూర్లు, 10 మందికి పైగా వరల్డ్ లీడర్లు, పాలసీ మేకర్లు, 50 మందికి పైగా స్టార్ స్పీకర్లు, సక్సెస్ఫుల్ సెలబ్రిటీలు, 200 మంది గ్లోబల్ ఇన్వెస్టర్లు, 250 స్టార్టప్ లు పాల్గొంటాయని టై హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలిపారు. ఇండియా, అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్ల నుంచి మొత్తంగా 25 టై చాప్టర్లు ఈ సమిట్కు రిప్రజెంటేటివ్స్గా ఉండనున్నాయి. కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోన్న ఈ క్రమంలో, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా టై గ్లోబల్ సమిట్ను నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ చెప్పారు. గత మూడు నెలల నుంచి ఈ సమిట్ కోసం సిద్దమవుతున్నామని, ఈ సమిట్లో పాల్గొనే ఎంట్రప్రెన్యూర్లకు 360 డిగ్రీల్లో(అన్ని రకాల) తాము సాయం అందించనున్నామని అన్నారు. ఎంట్రప్రెన్యూర్లకోసం వన్ టూ వన్ సెషన్లను, బోర్డుమీటింగ్లను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ఫండ్ సేకరణకు, మార్కెటింగ్ యాక్సస్కు ఈ సమిట్ ద్వారా స్టార్టప్ లకు సాయం చేయనున్నామని తెలిపారు. ఇన్వెస్టర్లకు కూడా వారి ఇన్వెస్ట్మెంట్ నుంచి లాభాలు పొందేలా సహకరించనున్నామన్నారు. సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్, జెఫ్ బెజోస్, ఇంద్రానూయీ, ఆనంద్ మహింద్రా, విజయ్ శేఖర్ శర్మ, రితేష్ అగర్వాల్, కిరణ్ మజుందర్ షా లాంటి ప్రముఖులు ఈ సమిట్లో పాల్గొంటారని వెల్లడించారు.
50 శాతం మంది ఇండియా నుంచే…
టై అనేది ఎంట్రప్రెన్యూర్లు, ప్రొఫెషనల్స్ కోసం ఏర్పాటుచేసిన ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్. ఈ సారి సమిట్ను ‘ఎంట్రప్రెన్యూర్షిప్ 360’ థీమ్తో నిర్వహిస్తున్నట్టు టై హైదరాబాద్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీనిరాజు తెలిపారు. ఈసారి గ్లోబల్ ఈవెంట్ను తాము జరపడం అతిపెద్ద అవకాశంగా భావిస్తున్నట్టు తెలిపారు. టై హైదరాబాద్ ఈ ఈవెంట్ను జరపడం ఇదే తొలిసారని, మొత్తంగా ఇండియాలో ఐదు సార్లు ఈ గ్లోబల్ సమిట్ జరిగినట్టు టై హైదరాబాద్ సభ్యులు చెప్పారు. మొత్తంగా ఈసారి సమిట్లో పాల్గొనే 20 వేల మందిలో 50 శాతం మంది ఇండియా నుంచే హాజరు కానున్నట్టు తెలిపారు. టై గ్లోబల్ సమిట్ 2020 అనేది ఎంతో ప్రత్యేకమైందని టై గ్లోబల్ ఛైర్మన్ మహావీర్ శర్మ అన్నారు. వర్చ్యువల్ ప్లాట్ఫామ్ ద్వారా ఎంట్రప్రెన్యూర్లను, ఇన్వెస్టర్లను, గ్లోబల్ లీడర్లను, స్పీకర్లను ఒకే వేదికపైకి తీసుకురానున్నామని చెప్పారు. 25కి పైగా దేశాల నుంచి ఎంట్రప్రెన్యూర్లు ఈ సమిట్కు హాజరుకానున్నారని పేర్కొన్నారు. బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడానికి స్టార్టప్ లకు ఇదొక వేదికని చెప్పారు.
ఐడియాలు షేర్ చేసుకోవచ్చు…
ఈ సమిట్లో ఎంట్రప్రెన్యూయర్లు ఎదుర్కొంటోన్న సమస్యలను గుర్తించనున్నారు. వారికి ఫండింగ్ కోసం ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయనున్నారు. కొత్త స్టార్టప్ ఐడియాలతో వ్యాపారాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా సహకరించనున్నారు. ‘ఈ క్లిష్టతరమైన పరిస్థితుల్లో టై ఈ సమిట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ వర్చ్యువల్గా ఈ సమిట్ను నిర్వహించడం నిజంగా ఆనందదాయకం. ఈ సమయంలో ఇనొవేటర్లకు, ఎంట్రప్రెన్యూర్లకు, యంగ్ స్టార్టప్లకు ఎంతో చేయాల్సి ఉంది. కరోనా వ్యాపారాలను చాలా దెబ్బకొట్టింది. కానీ ఇదే సమయంలో చాలా అవకాశాలు కూడా ముందుకొచ్చాయి. ఈ గ్లోబల్ సమిట్ను నిర్వహించే ఆర్గనైజర్లకు కంగ్రాట్యులేషన్స్. సమిట్లో పాల్గొనే వారికి నా బెస్ట్ విషెస్’
– జయేశ్ రంజన్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐటీ, తెలంగాణ ప్రభుత్వం
For More News..